Telangana Police Covid Cases : తెలంగాణ పోలీసు శాఖను కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న పోలీసులకు థర్డ్ వేవ్ లో కోవిడ్ సోకటం తీవ్ర కలకలం రేపుతోంది.
మొదటి దశ,రెండవ దశల్లో కరోనా బారిన పడి చాలా మంది పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందికి కోవిడ్ సోకటంతో విధులు నిర్వహించాలంటే పోలీసులు వణికి పోతున్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించి విధులు నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులు కోరుతున్నారు.
రాష్ట్ర పోలీసులపై థర్డ్ వేవ్ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. హోంగార్డు దగ్గర నుండి ఐపీఎస్ అధికారి వరకు వైరస్ బారిన పడుతున్నారు. గత రెండు దశలతో పోలిస్తే.. ఈసారి కొవిడ్ ప్రభావం పోలీసుల పైన ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిత్యం ప్రజలతో మమేకమవ్వాల్సి ఉండటం వల్ల… జాగ్రత్తలు తీసుకుంటున్నా కొంత మంది పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో బూస్టర్ డోసుల వేగం పెంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మొదటి దశ, రెండవ దశలో దాదాపు 80 మంది పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్లో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ బాస్ సూచిస్తున్నారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను పటిష్టంగా అమలు చేయడంలో పోలీసులు వ్యవహరించిన సేవలు మరచిపోలేము. రోడ్ల మీదకు ప్రజలు ఎవ్వరు రాకుండా పకడ్బందీగా పోలీసులు విధులు నిర్వహించారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న పోలీస్ సిబ్బందికి థర్డ్వేవ్ కరోనా వెంటాడుతోంది… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ వేవ్ లో ఇప్పటి వరకు దాదాపు 600 పైగా పోలీస్ అధికారులు కరోనా బారిన పడ్డారు. ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో సిబ్బంది క్వారంటైన్ లోకి పోవడంతో పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత స్పష్టం గా కనబడుతోంది.
మొదటి దశలో దాదాపు 2000 మంది సిబ్బందికి కరోనా బారిన పడగా….. అందులో 50 మంది సిబ్బంది కరోనాతో మృత్యువాత పడ్డారు. రెండవ దశలో 1000 మందికి కరోనా సోకగా అందులో 30 మంది చనిపోయారు. థర్డ్ వేవ్ లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మూడు కమీషనరేట్ల పరిధిలో ఉన్న సిబ్బందికి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సెలవు తీసుకొని టెస్ట్ లు చేయించుకోవాలని కమీషనర్లు ఆదేశాలు జారీచేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు. వాహనదారులను చెక్ చేస్తున్న సమయంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బంజారాహిల్స్, ఎస్సార్ నగర్,చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లలో సిబ్బందికి ఒకే రోజు పదుల సంఖ్యలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 5మంది సిబ్బందికి కోవిడ్ సోకింది. కరోనా వచ్చిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేసుల నిమిత్తం ఇతర రాష్టాలకు వెళ్లి వచ్చిన పోలీస్ సిబ్బంది 90 శాతం కరోనా బారిన పడుతున్నారు.
పోలీస్ సిబ్బందిలో కరోనా కేసులు పెరగడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి సంఖ్యపై అధికారులు ఆంక్షలు విధించారు. ఫిర్యాదు దారుడు ఒక్కరు మాత్రమే పోలీసు స్టేషన్కు రావాలని అదికూడా మాస్క్ ధరించాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో దాదాపు అందరూ కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. బూస్టర్ డోసు కూడా వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్టేషన్ల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించి అందరూ బూస్టర్ డోసు తీసుకునేలా చూస్తున్నారు.
Also Read : AP Covid Update : ఏపీలో కొత్తగా 4,108 కోవిడ్ కేసులు… జీరో మరణాలు
డిపార్ట్మెంట్లో కొత్తగా చేరిన, కానిస్టేబుల్స్, ఎస్సైలను ఫీల్డ్ వర్క్కు తీసుకుంటున్నారు. మహిళా కానిస్టేబుల్స్తో సహా కొత్త ఎస్సైలను నైట్కర్ఫ్యూలో డ్యూటీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో డిపార్ట్మెంట్లో 50 ఏండ్లకు పైబడిన హెడ్కానిస్టేబుల్స్, ఏఎస్సైలను ఫీల్డ్ డ్యూటీ కాకుండా ఆఫీస్ డ్యూటీకి పరిమితం చేస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి లీవ్ సాంక్షన్ చేస్తున్నారు. పోలీసు శాఖలో పాజిటివ్ కేసుల వివరాలను అధికారికంగా ప్రకటించకపోయినా బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది.