CPI (M) State Congress : ఘనంగా ప్రారంభమైన CPI(M) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేసీఆర్తో కలిసి పనిచేస్తామని కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్తో పనిచేస్తామంటే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటామని అర్థం కాదన్నారు.
- bheemraj
- Published On : January 23, 2022 / 05:30 PM IST
Cpm (1)
CPI (M) 3rd State Congress of Telangana : రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో ఇవాళ సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ మూడవ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ మహాసభలు కొనసాగనున్నాయి. మహాసభల సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, అమర వీరులకు నివాళులు అర్పించారు. ప్రతినిధుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, కుంజా బుజ్జికి సంతాప తీర్మానం ప్రవేశం పెట్టారు. మహాసభల ప్రారంభ సమావేశానికి సీపీఐ, సీపీఐఎం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
వామపక్షాల పునరేకీకరణ జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సీపీఐ, సీపీఎం భావసారుప్యత ఉన్న పార్టీలని, రెండు పార్టీల జాతీయ నాయకులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్పై రెండు లెఫ్ట్ పార్టీల విధానం ఒక్కటేనని చెప్పారు. వామపక్షాలు ఎప్పటికీ ప్రజల పక్షమేనని, సీట్లు లేకపోయినా క్రెడిబిలిటీ ఉన్న పార్టీ అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేసీఆర్తో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్తో పనిచేస్తామంటే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటామని అర్థం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సిద్ధాంత పరంగా మాత్రమే కలిసి పనిచేస్తామన్నారు. సీఎం కేసీఆర్ను సీపీఐఎం జాతీయ నేతలు కలవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయని, అవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని తమ్మినేని అన్నారు.
