Indian Railway
Indian Railway : ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. గడిచిన ఐదు రోజుల్లో 800కుపైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మరోవైపు విమాన టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిమితికి మించి వసూలు చేయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు.. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ (Indian Railway) ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. అయితే, ఈ రైళ్లలో ప్రయాణికుల అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పనుల నిమిత్తం వెళ్లిన ఓ వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్కు రావడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆ సర్వీసు రద్దయింది. దీంతో చెన్నై వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ లో థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకోగా అది కన్ ఫం కాలేదు. టీసీని బతిమిలిడగా సాధారణ చార్జీతోపాటు తనకు కొంత ముట్టజెప్పాలని ప్రయాణికుడిని కోరినట్లు తెలిసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీసీకి ఆ వ్యక్తి మొత్తం రూ.10,200 నగదు చెల్లించాడు.
ఇండిగో విమానాల రద్దుతో ఢిల్లీ – సికింద్రాబాద్ రైళ్లన్నీ కిటకిటలాడుతుండటంతో ప్రయాణికుల వెయిటింగ్ లిస్టే వందల్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్ఏసీ కన్ఫర్మేషన్ కావడం కష్టమంటూ కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రయాణికుడు నిలబడి వెళ్లేందుకు అనుమతించినందుకు టీసీ రూ.5వేలు వసూలు చేశాడని సమాచారం. ఇలా పలు రైళ్లలో కొందరు టీసీలు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.