Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత.. కన్నీటిసంద్రంలో సాహితీ లోకం
Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున తన నివాసంలో అస్వస్థతకుగురై ఆయన కుప్పకూలిపోయారు.
- Harish Thanniru
- Updated on- November 10, 2025 / 10:55 AM IST
Ande Sri
Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున తన నివాసంలో అందెశ్రీ అస్వస్థతకుగురై కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. ఉదయం 7.20గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. 7.25గంటలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ మరణంతో సాహితీలోకం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.
అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. అందెశ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో అందెశ్రీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే.
అందెశ్రీకి ముగ్గురు కుమార్తులు, కుమారుడు ఉన్నారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్శిటీ నుంచి అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ లభించింది. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం లభించింది. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది.
