Alay Balay : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి సినీ నటుడు చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. మోగాస్టార్ చిరంజీవి రాగానే అక్కడున్న చిన్నా పెద్ద అంతా చిరంజీవి చుట్టూ గుమిగూడారు. మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తున్న సమయంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి వచ్చేశారు. దీంతో అక్కడే కూర్చుని గరికపాటి ప్రసంగం వింటున్నవారంతా లేచి చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. పోటీ పడ్డారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. చిరంజీవితో అభిమానులు అంతా సెల్ఫీలు దిగటం చూస్తున్న గరికపాటి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. చిరంజీవి సెల్ఫీలు దిగటం ఆపితేనే తాను ప్రసంగిస్తానని లేదంటే ఇక్కడనుంచి వెళ్లిపోతాను అన్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి సెల్ఫీలు దిగటం ఆపివేసి వచ్చి గరికపాటి పక్కనే కూర్చున్నారు.
అనంతరం చిరంజీవి ప్రసంగిస్తూ గరికపాటి ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. అలయ్ బలయ్ అనేది తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉందని చెప్పారు. గతంలో ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్, అల్లు అరవింద్ హాజరయ్యారని… తాను కూడా హాజరు కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని… ఇప్పటికి అది సాధ్యమయిందని తెలిపారు. బండారు దత్తాత్రేయ గారు తన ఇంటికి వచ్చి తనను ఆహ్వానించారని చెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమం ఒక ఉన్నతమైన కార్యక్రమం అని… దీనికి దత్తాత్రేయ గారు విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారని చిరంజీవి కొనియాడారు. ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పంచే అద్భుతమైన కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరగాలని అన్నారు. మనం చెప్పలేని దాన్ని గుండె చప్పుడు చెపుతుందని… మాటకు లొంగని వ్యక్తి కూడా హృదయ స్పందనకు లొంగుతాడని అన్నారు.