×
Ad

Cm Revanth Reddy: ఎత్తుకు పైఎత్తులు.. హంగ్‌లో కింగ్‌ ఎవరు? తెలంగాణలో ఇంట్రెస్టింగ్‌గా మున్సిపల్ రాజకీయం

హంగ్ వ‌చ్చిన మున్సిపాలిటీలపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు కాంగ్రెస్ పెద్దలు. సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియ‌స్‌ ఎఫ‌ర్ట్స్‌ పెడుతున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

  • Published On : February 14, 2026 / 08:52 PM IST

Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)

  • దాదాపు 40 చోట్ల హంగ్..పైచేయి సాధించేదెవరు.?
  • ఛైర్మన్, మేయర్‌ పీఠాల కోసం హస్తం పార్టీ స్కెచ్‌లు
  • కరీంనగర్ మేయర్‌ పీఠంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

 

Cm Revanth Reddy: ఫుల్ హోస్స్‌ పెట్టుకున్నారు. అన్ని అస్త్రాలు వాడి పూర్తి స్థాయిలో అప్పర్ హ్యాండ్‌ సాధించే ప్లాన్ చేశారు. వార్‌ వన్‌ సైడే అని కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే హస్తం పార్టీకి చెప్పుకోదగ్గ ఫలితాలే వచ్చినా..కొన్ని చోట్ల హంగ్‌లు అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. ఏకంగా 36 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. క్లీన్‌ స్వీప్ చేయాలనుకున్న హ‌స్తం పార్టీ కొద్ది దూరంలోనే ఆగిపోయింది. హంగ్‌ వచ్చిన చోట మున్సిపాలిటీల‌ను హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. హంగ్‌లో కింగ్ ఎవరు? కీలకంగా ఉన్నచోట్ల బీఆర్ఎస్, బీజేపీ సపోర్ట్‌ ఎవరికి? కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ప్లాన్ లు వ‌ర్కౌట్‌ అయ్యేనా?

పురపోరు ఫలితాలు వచ్చేశాయి. మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌ పీఠాలపై కొన్ని చోట్ల క్లారిటీ వచ్చేసింది. మరికొన్ని చోట్ల మాత్రం మేయర్, మున్సిపల్ ఛైర్మన్ సీట్లు ఎవరి వశం అవుతాయన్నది సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మేయర్, ఛైర్మన్ల ఎన్నికకు టైమ్‌ దగ్గర పడుతున్న కొద్దీ అటు పార్టీల్లో..ఇటు ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే హంగ్‌ వచ్చిన చోట మున్సిపాలిటీల్లో ఉన్న సిచ్యువేషన్స్‌ హస్తం పార్టీకి సవాల్‌గా మారాయి. అధికార కాంగ్రెస్ మెజారిటీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోగా..చాలా చోట్ల హంగ్ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాక‌పోవ‌డంతో..అక్కడ మేయర్, ఛైర్మన్ పీఠాలను హస్తగతం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.

హంగ్ లోనూ కింగ్ అయ్యేలా… టాస్క్‌లు..

పార్టీ తరఫున గెలిచిన కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లను ఇప్పటికే క్యాంపులకు త‌ర‌లించారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 16న కార్పొరేష‌న్‌ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్..మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ లోగా హంగ్ వ‌చ్చిన వాటిని కూడా త‌మ ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. హంగ్‌లోనూ మనమే కింగ్‌ కావాలని..పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల‌కు టాస్క్‌లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

116 మున్సిపాలిటీల‌కు, ఏడు కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు జ‌రిగితే..66 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేష‌న్లను కాంగ్రెస్ ద‌క్కించుకుంది. ఇక హంగ్ వ‌చ్చిన 36 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష‌న్లపై గురిపెట్టింది అధికార పార్టీ. పూర్తిస్థాయి మెజారిటీ వ‌చ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లలో గెలిచిన వారిని మొద‌ట‌గా క్యాంప్‌కు త‌ర‌లించారు. ఈ నెల 16న జ‌రిగే మేయ‌ర్‌, ఛైర్మన్‌ ఎంపిక వ‌ర‌కు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేయి దాటిపోకుండా క్యాంపు రాజకీయం నడుపుతోంది. హంగ్ వ‌చ్చిన మున్సిపాలిటీలపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు కాంగ్రెస్ పెద్దలు. సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియ‌స్‌ ఎఫ‌ర్ట్స్‌ పెడుతున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రులు, పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌తో ప్రత్యేకంగా మంత‌నాలు జరిపారు. సాధ్యమైనంత వ‌ర‌కు మెజారిటీ చోట్ల కాంగ్రెస్ జెండా ఎగ‌రాల్సిందేన‌ని దిశానిర్దేశం చేశారు.

ఇండిపెండెంట్లు, కమ్యూనిస్టులు, ఎంఐఎం సహకారం తీసుకునే ప్లాన్..

మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గర‌గా ఉన్నచోట్ల ఇండిపెండెంట్ల మద్దతుతో పాటు మిత్రప‌క్షాలైన కమ్యూనిస్టులు, ఎంఐఎం సహకారం తీసుకోవాలని..కోఆర్డినేషన్‌ మిస్‌ కాకుండా..గ్యాప్‌ రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పార్టీ ప‌వ‌ర్‌లో ఉండ‌టంతో నయానో, బయానో అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఖాతాలోనే ఉండేలా ఈక్వేషన్స్‌ను మార్చేయాలన్నది కాంగ్రెస్ పెద్దల ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్లు కీలకంగా ఉన్నచోట్ల పోలీస్ అధికారుల సాయంతో క్యాంపుల‌కు త‌ర‌లించారు.

గద్వాల్ వంటి మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ల మద్దతు అవ‌స‌రం కావ‌డంతో..పోలీస్ ఎస్కార్ట్ సాయంతో ప‌హారా కాశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచిన నేత ఎమ్మెల్యే స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఇక వేముల‌వాడ‌లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థుల‌ను వెంట‌నే కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇలా మిగిలిన మున్సిపాలిటీల విష‌యంలో బ‌ల‌మైన వ్యూహాల‌ను ర‌చిస్తోంది అధికార పార్టీ.

కూనంనేనితో మాట్లాడి ఒప్పించాల్సిందిగా రేణుకా చౌద‌రికి బాధ్యతలు…

ఇక హంగ్ వ‌చ్చిన కార్పొరేష‌న్లను కూడా చేజిక్కుంచుకోవాల‌ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. కొత్తగూడెం కార్పొరేష‌న్‌లో మిత్రప‌క్షమైన సీపీఐతో సంప్రదింపులు చేసి..అక్కడ మేయర్‌ పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడి మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించారు. కూనంనేని కూడా బీఆర్ఎస్‌ మద్దతుతో మేయర్ సీటును కైవసం చేసుకునే ప్లాన్‌లో ఉన్నారని అంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న కూనంనేనితో మాట్లాడి ఒప్పించాల్సిందిగా రేణుకా చౌద‌రికి బాధ్యతలు అప్పగించారట సీఎం రేవంత్ రెడ్డి.

ఇక నిజామాబాద్ కార్పొరేష‌న్‌లో మేయర్‌ సీటు కోసం మిత్రప‌క్షమైన ఎంఐఎంతో పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే డిస్కస్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఉత్తర తెలంగాణలో కీలక నగరంగా ఉన్న క‌రీంన‌గ‌ర్‌ కార్పొరేషన్‌ను కూడా కైవ‌సం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ర‌చిస్తున్నారని పార్టీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 స్థానాల్లో..బీజేపీ 30, కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, బీఆర్ఎస్ 9, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు, స్వతంత్రులు 8 స్థానాల్లో గెలిచారు. అయితే ఎంఐఎం, స్వతంత్రులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్ పార్టీతో పాటు ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కలిపి కరీంనగర్ మేయర్ సీటును తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలనేది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు నేతలు.

ఇక మున్సిపాలిటీ, కార్పొరేష‌న్లలో అవ‌స‌ర‌మైన చోట ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో ఎవ‌రెవ‌రు ఎక్కడెక్కడ ఓటు వేయాల‌నే దానిపై ప్రత్యేకంగా స్టడీ చేశారు. అందుకు అనుగుణంగా ఎవ‌రికి ఎక్కడ అవ‌స‌రం ఉంటే అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్‌ అఫిషియో ఓటర్లుగా ఓటును న‌మోదు చేసుకున్నారు. ఇలా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌ను కైవ‌సం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఫోకస్ మ్యానర్‌లో పనిచేస్తోందట. హస్తం పార్టీ ఎత్తులు ఎంతవరకు వ‌ర్కౌట్ అవుతాయో చూడాలి.

Also Read: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. హస్తం పార్టీ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ