Komatireddy Brothers: అన్న ఓ రకం.. తమ్ముడు ఇంకో రకం..! కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు

ఇప్పటికే మంత్రి పదవి విషయంలో అన్నదమ్ముళ్ల మధ్య కోల్డ్‌ వార్ నడుస్తుందని అంటుంటారు. వెంకట్‌రెడ్డిని తప్పిస్తే తప్ప రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయంలో అధిష్టానం ఉందంటున్నారు.

  • Published On : March 21, 2026 / 12:02 AM IST

Komati Reddy Brothers Representative Image (Image Credit To Original Source)

  • సినిమాటోగ్రఫీ శాఖను వెంకట్‌రెడ్డి గాలికి వదిలేశారన్న టాక్
  • గద్దర్ అవార్డుల ఫంక్షన్‌కు వెంకట్‌రెడ్డి కొందుకు రానట్లు.?
  • జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ చేయాలంటూ ఇంకో ట్విస్ట్
  • మంత్రి పదవి కోసం రాజగోపాల్‌రెడ్డి పొలిటికల్ గన్ ఫైర్
  • కోమటిరెడ్డి బ్రదర్స్‌ రేవంత్‌కు కొరకరాని కొయ్యగా మారారా?

 

Komatireddy Brothers: వాళ్ల ఇంటి పేరు పాలిటిక్స్‌లో ఓ బ్రాండ్. కానీ ఆ ఇద్దరు బ్రదర్స్ తీరే సెపరేటు. అన్న ఒకలా..తమ్ముడు మరోలా..టోన్ వినిపించడం వాళ్ల స్టైల్. అన్నయ్య తబలా. తమ్ముడి మ్యూజిక్. ట్విస్టులే ట్విస్టులు..అంతకు మించి మల్టిపుల్ షేడ్స్ చూపిస్తూ..సీఎం రేవంత్‌కు హెడెక్‌గా మారారట ఆ ఇద్దరు బ్రదర్స్. అన్న సొంత శాఖను గాలికి వదిలేసి..సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ చర్చకు దారితీస్తుంటే..తమ్ముడు మంత్రి పదవి కోసం ఏకే 47 ఎక్కుపెడుతున్నారు. కొరకరాని కొయ్యలా మారి సీఎంకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారట. రేవంత్‌కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎవ‌రు? వాళ్ల తీరు ఎందుకలా?

కోమటిరెడ్డి బ్రదర్స్. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇదో ట్యాగ్‌ లైన్. అందుకు తగ్గట్లు వారు కూడా ఓ బ్రాండ్‌ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆ అన్నదమ్ముళ్ల తీరే సమ్‌థింగ్ డిఫరెంట్. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు. వెంకట్‌రెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖలు నిర్వహిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి అమాత్య యోగం దక్కట్లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎం రేవంత్‌ టార్గెట్‌గా బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలో ఆ బ్రదర్స్‌ రూటు సెపరేటు అయిపోయింది. వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్‌కు పాజిటివ్‌ వాయిస్ వినిపిస్తూనే అప్పుడప్పుడు ట్విస్టులు ఇస్తున్నారు. ఇక రాజగోపాల్‌రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కే వరకు తగ్గేదేలే అన్నట్లుగా అసంతృప్తి సెగ రాజేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు బ్రదర్స్ తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌కు కంట్లో నలుసులా..కొరకరాని కొయ్యలా తయారైందట.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి..సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కోమటిరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కోమటిరెడ్డి తన శాఖను గాలికి వదిలేసి..లేనిపోని ఇష్యూల జోలికి వెళ్తున్నారన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అసలు తన శాఖలో జరిగే వ్యవహారాలు తనకు తెలియదన్నట్లుగా అప్పుడప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తూ చర్చకు దారి తీస్తున్నారాయన.

వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై బీసీ నేతల నుంచి వ్యతిరేకత..

సినిమా టికెట్ల రేట్ల పెంపుతో తనకు సంబంధం లేదని ఓసారి..ఇక నుంచి ఏ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు ఉండదని మరోసారి పొంతన లేని వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి..ఏకంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. అయితే బిజీగా ఉండటం వల్లే రాలేదా? లేక వెంకట్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంతకంటే రెండ్రోజుల ముందే జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్‌గా చేయాలని ఓ గత్తర లేపారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. జగ్గారెడ్డి మరో పీజేఆర్ అని..ఆయన లాంటి మాస్‌ లీడర్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు వస్తాయంటూ చర్చకు తెరలేపారు. దీంతో వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోని బీసీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోందట.

ఇక ఇప్పటికే మంత్రి పదవి విషయంలో అన్నదమ్ముళ్ల మధ్య కోల్డ్‌ వార్ నడుస్తుందని అంటుంటారు. వెంకట్‌రెడ్డిని తప్పిస్తే తప్ప రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయంలో అధిష్టానం ఉందంటున్నారు. అయితే వెంకట్‌రెడ్డే మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారట రేవంత్‌. రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదట. ఇదే రాజగోపాల్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్‌కు కారణమంటున్నారు. ఈ క్రమంలోనే అన్నదో దారి అయితే..తమ్ముడిది మరో దారి అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు.

ట్రిపుల్ ఆర్‌ రోడ్డు విషయంలో నిర్వాసితుల పక్షాన రాజగోపాల్‌రెడ్డి వాయిస్ వినిపిస్తే..రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు వెంకట్‌రెడ్డి. ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారాయన. ఇక నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌ నేత నియామకంపై వెంకట్‌రెడ్డి సుర్రుబుర్రులాడితే..రాజగోపాల్‌రెడ్డి కైలాష్‌ నేతకు పగ్గాలు అప్పజెప్పడాన్ని స్వాగతించారు. ఇక సీఎం రేవంతే ఇంకో పదేళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..దేవుడ్ని కోరుకున్నాని వెంకట్‌రెడ్డి చెప్తే..తానే సీఎం అని రేవంత్ ఎలా చెప్పుకుంటారంటూ అటాక్ చేశారు రాజగోపాల్‌రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వట్లేదన్న అసంతృప్తితో పలువురు ఎమ్మెల్యేలతో రాజగోపాల్‌రెడ్డి డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న టాక్ కూడా అధికార పార్టీని కలవరపెడుతోంది.

అన్నదమ్ముల తీరుతో విసిగిపోయిన సీఎం రేవంత్?

ఇలా ఇష్యూ ఏదైనా..టాపిక్ మరేదైనా.. చెరో తీరు స్పందిస్తూ అన్నదమ్ముళ్లు సీఎం రేవంత్‌కు కొరకరాని కొయ్యలా మారారాన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కరువమంటే కప్పుకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా..కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎవరి మాట వినే పరిస్థితి లేదట. పైగా తీరు మార్చుకోమని చెప్పే సాహసం కూడా ఎవరూ చేయట్లేదట. దీంతో వాళ్లిద్దరి తీరుతో సీఎం రేవంత్‌ విసిగిపోయారని ఇన్ సైడ్‌ టాక్. వెంకట్‌రెడ్డి వ్యవహార శైలి మారేదెప్పుడో? రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి చల్లారేదెప్పుడో చూడాలి.

Also Read: కొత్త విప్‌ల నియామకం.. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? వారికి ప్రమోషన్ దక్కబోతోందా?