కాంగ్రెస్‌లో కలకలం రేపిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. చిన్న విషయానికే అంత సీరియస్‌ ఎందుకయ్యారు?

రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎమ్మెల్యే వీరేశం ఎపిసోడ్ దుమారం రేపుతోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనను అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా, స్పీకర్‌కు ఫిర్యాదు చేసి తన జోలికొస్తే ఖబర్దార్ అన్నట్లు సంకేతాలు పంపడానికే ఇంత సీన్ క్రియేట్ చేశారంటున్నారు.

Gossip Garage : కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఎప్పుడూ హాట్‌ హాట్‌ డిబేట్‌కు వేదికవుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ ఆ పార్టీలో కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రూపంలో మరో రచ్చ రాజుకుంటోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వీరేశం… తనకు అవమానం జరిగిందని, ప్రొటోకాల్ పాటించలేదంటూ పోలీసు అధికారులపై సభాహక్కుల నోటీసు ఇవ్వడమే ఇప్పుడు హాట్‌ టాపిక్ అవుతోంది.

అధికారం చేతిలో ఉండగా, అవమానం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే వీలున్నా, స్పీకర్‌కు ఫిర్యాదు చేసి సభా హక్కుల నోటీసు ఇవ్వడమే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. తనకు అవమానం జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే నిజంగా పోలీసులపై యాక్షన్ కోరుకుంటూనే స్పీకర్ కు నోటీసులిచ్చారా? లేదంటే పోలీసుల భుజంపై గన్ ఎక్కుపెట్టి ఇంకెవరినైనా టార్గెట్ చేస్తున్నారా…? అన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో డిబేట్ జరుగుతోంది. ఇంతకీ వేముల వీరేశం అసలు లక్ష్యం ఏంటి..?

కాంగ్రెస్ లో వేముల వీరేశం కలకలం..
కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా చాలా కీ రోల్ పోషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు 11 సీట్లు గెలుపొందింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు స్థానాలు ఉంటే.. రెండు చోట్లా విజయం సాధించింది. ఇదే జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కు కంచుకోట లాంటి నల్లగొండ జిల్లాకు చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా మొన్నటి ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలుపొందారు. అయితే అధికార పార్టీలో కీరోల్ పోషిస్తున్న ఎమ్మెల్యే వీరేశం తనను అవమానించారని కొందరు పోలీసులపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.

ఏకంగా స్పీకర్ ను కలిసి ఫిర్యాదు..
గత నెల 30న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇరిగేషన్ శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చే మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఎమ్మెల్యే వీరేశంను పోలీసులు అనుమతించలేదు. దీంతో హర్ట్ అయిన ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలైతే ప్రభుత్వం దృష్టికో, స్థానిక మంత్రుల దృష్టికో తీసుకెళ్లి ఇష్యూను సెటిల్ చేసుకుంటారు. అయితే విపక్ష ఎమ్మెల్యేలు చేసినట్లుగా ఏకంగా పోలీస్ అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి ఫ్రివిలేజ్ మోషన్ కింద ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు వెళ్లనీయకుండా అడ్డుకోవడంలో మతలబు ఏంటి?
ఎమ్మెల్యే వేముల వీరేశం స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులో పోలీస్ అధికారుల తీరును నిరసిస్తూ అవమానకరంగా ప్రవర్తించినందుకే ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చిన్న విషయానికి అంత సీరియస్ అవడం వెనుక చాలా చర్చ జరుగుతోంది. వేముల వీరేశం ఆగ్రహానికి ఇంకేదైనా కారణముందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. ప్రభుత్వంలో భాగమైన పోలీసులపై ఫిర్యాదు చేయడంతో వీరేశం అంతరంగం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రభుత్వం నిర్వహించే సమీక్షకు.. అందులోనూ మంత్రుల వద్దకు వెళ్లే సందర్భంలో పోలీసులు వెళ్లనీయకుండా అడ్డుకోవడంలో మతలబు ఏంటి అనే దానిపై ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టారు. అందుకే నేరుగా స్పీకర్ ను కలిసి పోలీసులపై ప్రివిలేజ్ మోషన్ కింద ఫిర్యాదు చేశారు.

వీరేశం టార్గెట్ ఎవరు?
తన శత్రువర్గం ముందు తనను బలహీనం చేసేలా వ్యవహరించారంటూ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వీరేశం… శత్రువర్గం ఎవరన్నది పార్టీలో చర్చకు కారణమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వీరేశం ప్రభుత్వ అధికార కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ అధికారులు తప్ప మరెవరూ లేరని అంటున్నారు. ఇక శత్రువర్గం అంటూ ఫిర్యాదు చేయడంతో వీరేశంకు సొంత పార్టీలో ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారా? అని అంతా ఆరా తీస్తున్నారు. అధికారులపై ఫిర్యాదు చేసినా, శత్రువర్గం అంటూ చెప్పడంతో అనుమానాలు ఎక్కువవుతున్నాయి. వీరేశం టార్గెట్ ఎవరన్నది అంతుచిక్కక.. గత ఎన్నికల తర్వాత వీరేశానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? అని ఆరా తీస్తున్నారు.

Also Read : వినాయకచవితి తర్వాత సమరమే..! మళ్లీ రంగంలోకి కేసీఆర్..

ఏదిఏమైనా రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎమ్మెల్యే వీరేశం ఎపిసోడ్ దుమారం రేపుతోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనను అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా, స్పీకర్‌కు ఫిర్యాదు చేసి తన జోలికొస్తే ఖబర్దార్ అన్నట్లు సంకేతాలు పంపడానికే ఇంత సీన్ క్రియేట్ చేశారంటున్నారు. మొత్తానికి వీరేశం ఎపిసోడ్ ఎటు దారితీస్తుందోనది సస్పెన్స్‌గా మారింది.

 

ట్రెండింగ్ వార్తలు