Cm Revanth Reddy: హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ అయ్యేనా? డీలిమిటేష‌న్‌పై రేవంత్ సరికొత్త లాజిక్స్‌తో చర్చ..

నియోజ‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నపై 1976లో 42వ స‌వ‌ర‌ణ చేసిన ఇందిరా గాంధీ..అప్పటి వ‌ర‌కు జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు ఫ్రీజ్‌ చేసింది.

  • Updated on- April 15, 2026 / 01:10 AM IST
  • మోదీ ఫార్ములా ద‌క్షిణాదికి శాపమంటున్న రేవంత్
  • సీట్ల పెంపు వేళ నార్త్‌, సౌత్‌ మధ్య హైబ్రీడ్ కుంప‌టి..!
  • రేవంత్ వాదనను కొట్టి పారేస్తున్న కమలనాథులు..
  • మ‌హిళా రిజ‌ర్వేష‌న్, డీలిమిటేష‌న్ ముందుకు సాగేనా?

 

Cm Revanth Reddy: ఉమెన్‌ కోటా, డీలిమిటేష‌న్‌పై మోదీ స‌ర్కార్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. అబ్జక్షన్‌ యువరానర్‌ అంటూ సౌత్ సెంట్రిక్‌గా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త ప్రపోజల్‌తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. హైబ్రిడ్ మోడ‌ల్ అం‌టూ దేశ రాజ‌కీయాల్లో కొత్త ర‌చ్చకు తెరలేపారు. మోదీ తీరుతో ద‌క్షిణాదికి తీర‌ని న‌ష్టమని రేవంత్ అంటుంటే..ఆయనది బేస్ లెస్ ఆర్గ్యుమెంట్‌ అంటూ కొట్టి పారేస్తోంది కమలదళం. రేవంత్ అభ్యంతరాలేంటి? బీజేపీ ఇస్తున్న రిప్లై ఎలా ఉంది?

డీలిమిటేషన్. అదే అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పెంపు. ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పటి నుంచి ఒకటే చర్చ. దక్షిణాదికి అన్యాయం అంటూ..సౌత్ స్టేట్స్‌ వాయిస్ రేజ్‌ చేస్తున్నాయి. మరోవైపు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌ను ఏర్పాటు చేసి..ఉమెన్ కోటా, డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదించాలని డిసైడ్ అయింది. సరిగ్గా ఇదే టైమ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..తీసుకొచ్చిన స‌రికొత్త హైబ్రిడ్ మోడ‌ల్..మ‌రో కొత్త చ‌ర్చకు తెర‌తీసింది.

రాజ‌కీయంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం..

ప్రస్తుతం లోక్‌సభలో ఉత్తరాది రాష్ట్రాలకు యూపీ, బీహార్, మ‌ధ్యప్రదేశ్‌ క‌లుపుకుని 413 సీట్లు ఉన్నాయి. ఇక దక్షిణాదికి చెందిన తెలంగాణ, ఏపీ, త‌మిళనాడు, కర్నాటక, కేరళకు కేవలం 130 స్థానాలు మాత్రమే. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదన జ‌నాభా ప్రాతిపాదిక‌న 50 శాతం సీట్లు పెంచితే..ఉత్తరాదికి 621 సీట్లు, ద‌క్షిణాదికి కేవలం 195 సీట్లు అవుతాయి. ఇలా నార్త్ స్టేట్స్-సౌత్ స్టేట్స్‌ మ‌ధ్య లోక్‌సభ సీట్ల గ్యాప్ భారీగా ఉండనుంది. పాత సీట్ల ప్రకారమే నార్త్ సౌత్ మధ్య 283 సీట్ల తేడా ఉంటే..కొత్తగా పెరగపోయే స్థానాల ప్రకారం..426 సీట్ల వ్యత్యాసం ఉంటుంది. ఇది రాజ‌కీయంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయమని..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రీడ్‌ మోడ‌ల్‌ను తెర‌పైకి తెస్తున్నారు. ఇదే ఇప్పుడు నేష‌నల్‌ పాలిటిక్స్‌లో అగ్గి రాజేసింది.

కేంద్రం 272 సీట్లు పెంచాలనుకుంటుంది కాబట్టి..అందులో 50శాతం సీట్లను జనాభా ప్రతిపాదికనా..మిగతా 50 శాతం స్థానాలను GSDP రాష్ట్రాలకు కేటాయించాలనేది రేవంత్‌ ప్రపోజల్‌. GSDPలో దక్షిణ రాష్ట్రాలే ముందుండటంతో..మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, తెలంగాణకు లాభం జరుగుందనేది ఆయన లెక్క. జనాభా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు తాము అందిస్తున్న సహకారాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలన్నది రేవంత్ రెడ్డి వాద‌న‌. ఇలా చేస్తే రాజ‌కీయంగా ఉత్తర ద‌క్షిణాది రాష్ట్రాల మ‌ధ్య అంత‌రాలు ఉండవంటూ హైబ్రీడ్ మోడల్‌ అంటూ కొత్త ఫార్ములా..నేషనల్ పొలిటికల్ స్క్రీన్‌కు మీదకు వదిలారు రేవంత్‌రెడ్డి.

పన్నుల ఆధారంగా సీట్లు ఇస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?

ఈ హైబ్రీడ్‌ మోడల్‌ ప్రపోజల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల విభజన అనేది జనాభా ప్రాతిపదికన జరగాలి కానీ, కట్టే పన్నుల ఆధారంగా కాదన్నది కాషాయ నేతల లాజిక్. పన్నుల ఆధారంగా సీట్లు ఇస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. GSDP ఆధారంగా సీట్లు పెంచితే అది ధనిక రాష్ట్రాల ఆధిపత్యం అవుతుందంటూ బీజేపీ నేతలు వాయిస్ రేజ్ చేస్తున్నారు. రేవంత్ బేస్ లెస్ వాద‌న‌తో డీలిమిటేష‌న్‌ను అడ్డుకోవ‌ద్దని సూచిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి హైబ్రీడ్ మోడ‌ల్, వ‌ర్సెస్ బీజేపీ ప్రో రేటా మోడ‌ల్ మ‌ధ్య తీవ్ర చ‌ర్చ జ‌ర‌గుతుండ‌గా..గ‌తంలో ఇందిరా గాంధీ, వాజ్‌పేయ్‌ హ‌యాంలో ఏం జ‌రిగిందనేది అన్నది కూడా మ‌రోసారి చ‌ర్చకు వ‌స్తోంది.

నియోజ‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నపై 1976లో 42వ స‌వ‌ర‌ణ చేసిన ఇందిరా గాంధీ..అప్పటి వ‌ర‌కు జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు ఫ్రీజ్‌ చేసింది. తర్వాత వాజపేయ్‌ ప్రభుత్వం దానిని 2026 వరకు పొడిగించింది. ఆ గడువు ఇప్పుడు ముగుస్తుండటంతో..ఇప్పుడు డీలిమిటేష‌న్‌ను తెర‌పైకి తెచ్చిన మోదీ స‌ర్కార్..2011 సెన్సెస్ ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. ఈ డీలిమిటేష‌న్‌ను జనాభా ప్రాతిపాదిక‌న చేస్తే..ద‌క్షిణాది రాష్ట్రాల‌కు రాజ‌కీయ మ‌నుగ‌డ‌నే ఉండ‌దనేది సౌత్ స్టేట్స్ వాద‌న‌. కేంద్రం తెర‌మీద‌కు తెచ్చిన ఫిఫ్టీ ప‌ర్సెంట్ సీట్ల ప్రతిపాద‌న కూడా దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తుందని అంటున్నారు.

దక్షిణాదితో సంబంధం లేకుండా..కేంద్రంలో స‌ర్కార్ న‌డిచే పరిస్థితి ఏర్పడుతుందని..అదే జ‌రిగితే..సౌత్-నార్త్ ఫైట్‌కు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు రేవంత్ రెడ్డి. నిపుణుల కమిటీ వేసి, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో దీనిపై చర్చించాలని, 2028 మార్చి వరకు దీనిపై తుది నిర్ణయం తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి డీలిమిటేష‌న్‌పై రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన హైబ్రీడ్ మోడ‌ల్ వ‌ర్సెస్..మోదీ ఫిఫ్టీ-ఫిఫ్టీ పార్ములా ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. పాపులేషన్ వర్సెస్ GSDP..నార్త్ వర్సెస్ సౌత్‌ అన్నట్లుగా మారిన డీలిమిటేష‌న్ అంశంపై కేంద్రం బ్యాక్ స్టెప్ వేస్తుందా? రేవంత్ ప్రపోజల్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? లేక ఫిఫ్టీ ఫార్ములాతోనే ముందుకెళ్తుందా అనేది చూడాలి.

Also Read: ఏపీ కోటా రాజ్యసభ సీట్ల రేసులో ట్విస్టులు..! ఆశావహుల లిస్ట్‌లో తెరపైకి ఊహించని పేర్లు..!