Rain Alert
Rain Alert :తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు.. ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడే ఈ అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో వచ్చే ఐదు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read : ట్రంప్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడి వాన్స్.. అతని సతీమణి భారత సంతతి మహిళ.. ఆమె ఎవరంటే?
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి, జనగామ, సిద్ధిపేట, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : చంద్రుడిపై గుహ.. శాశ్వత స్థావరాల ఏర్పాటుకు మానవులకు అనువైన ప్రదేశంగా గుర్తింపు..
ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 19న ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడే అల్పపీడనం వల్ల వచ్చే ఐదు రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ (మంగళవారం) మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.