Historical Primitives Landmarks : సిద్దిపేటలో ఆదిమానవుడి ఆనవాళ్లు.. 15వేల ఏళ్ల నాటి పురాతన వస్తువులు
ఆదిమానవుడి యుగం నాటి ఆనవాళ్లు సిద్దిపేట జిల్లాలో బయటపడ్డాయి. పాత రాతియుగం, అన్ని యుగాల మానవులు ఇదే ప్రాంతంలో నివసించినట్లు ఆధారాలు బయటపడ్డాయి.
- Sreehari A
- Updated on- March 17, 2021 / 03:06 PM IST
Historical Primitives Landmarks
historical primitives landmarks : ఆదిమానవుడి యుగం నాటి ఆనవాళ్లు సిద్దిపేట జిల్లాలో బయటపడ్డాయి. పాత రాతియుగం, అన్ని యుగాల మానవులు ఇదే ప్రాంతంలో నివసించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. జైన, బౌద్ధ మతాలు, శాతవాహనులు, చాణిక్యులు, కాకతీయులు పలు రాజవంశీయులు సిద్దిపేట ప్రాంతాన్ని పాలించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. పురాతన యుగం నాటి వస్తువులు, శాసనాలు, విగ్రహాలు, ఆయుధాలు, పూసలు, సమాధులు బయటపడుతున్నాయి.
సిద్దిపేట జిల్లాలోని పుల్లూరులో జీవించినట్లు ఆధారాలు లభించాయి. ఆరాధ్య దేవత శక్తి స్వరూపిణి అమ్మవారి విగ్రహం, ప్రత్యేక రాతి గుహల నడుమ నిర్మించిన సమాధులు, వినియోగించిన పలు రకాల వస్తువులు బయటపడ్డాయి. వీటిని పరిశీలించిన చరిత్రకారులు క్రీ.పూ 5వేల ఏళ్ల క్రితం నాటివిగా గుర్తించారు.
అమ్మవారి విగ్రహానికి సమీపంలో బౌద్ధ బ్రహ్మ కూడా లభించింది. బావుల నిర్మాణం, మట్టి పాత్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. బౌద్ధ బ్రహ్మ విగ్రహం పాకిస్తాన్లో ఒకచోట లభించింది. మరొకటి సిద్దిపేట జిల్లా సింగరాయకొండ సమీపంలో లభించినట్టు చరిత్రకారులు వెల్లడించారు.
జైనమత తీర్థాంకరుల్లో 23వ వాడైన పార్శనాథుడి విగ్రహం శనిగరం గుట్టపై లభించింది. జైనుల కాలంలో మహిళాయక్షిణి, పక్కన చంటి పిల్లవాడు పట్టుకున్న అపురూప శిల్పం లభించింది. తర్వాత కాలంలో గొల్ల కేతమ్మగా పిలుస్తున్నారు. ఆదిమానవుడి సమాధులు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. బండరాళ్లను పేర్చి నిర్మించిన సమాధులు లభించాయి. జైనుల కాలం నాటివేనని పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు.
కూరెళ్లలో జైనమత గుర్తులుగా భావించే చౌముఖి శిల్పం తవ్వకాల్లో బయటపడింది. కొమురవెల్లి గుట్టపైన జైన మత విగ్రహాలు, ఆనవాళ్లు లభించాయి. వీటిని ఆధారంగా చేసుకొని మృతి చెందినవ్యక్తి స్థాయిని అంచనా వేయొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో నలుమూలలా ఆది మానవుడు జీవించినట్టు చరిత్ర బయటపెట్టింది. క్రీస్తుపూర్వం 15 వేల ఏళ్ల క్రితమే యూరప్ నుంచి ఒక తెగ సిద్దిపేటప్రాంతానికి వచ్చి జీవించినట్లు ఆధారాలు బయటపడ్డాయి.
