Pawan Kalyan : నిన్న ప్రెస్‌మీట్.. ఇవాళ ఆసక్తికర ట్వీట్.. ‘అదే నా రాస్తా’ అంటూ పవన్ కల్యాణ్ పోస్టు.. జనసేనాని దూకుడు..

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై గట్టిగానే దృష్టిసారించినట్లు కనిపిస్తోంది.

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై గట్టిగానే దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆ సభకు తెలంగాణ సర్కార్ అనుమతి నిరాకరించింది. హైకోర్టులో సైతం జనసేన పార్టీకి చుక్కెదురైంది. దీంతో పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : India Gold Imports : దేశంలో ప్రజల వద్ద 32వేల టన్నుల బంగారం నిల్వలు.. అందులో కేవలం 1శాతం రీసైక్లింగ్ చేస్తేచాలు.. ఆ తరువాత ఏం జరుగుతుంది?

పవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు బదులిచ్చారు. జనసేన ప్రయాణం తెలంగాణలోనే మొదలైందని అన్నారు. కానీ, కొంతమంది నాయకులు హైదరాబాద్లో ఎలా అడుగు పెడతావ్..? నీకు ఇక్కడేం పని అని మాట్లాడుతున్నారు.. నన్ను బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జారీరా? ఇక్కడ కొంతమంది నాయకులు జనాన్ని రెచ్చగొడుతున్నారు. నాపై దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. దాడి చేయాలనుకుంటే సంతోషంగా రండి.. ఇదే నా ఇల్లు. బాంచన్ మీ కాల్మొక్తా అనే వాడిని కాదు.. ధైర్యంగా నిలబడతాం. భయం అనేది లేదని పవన్ అన్నారు. ఇదే సమయంలో పవన్ కీలక ప్రకటన చేశారు. ఇన్నాళ్లూ తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని నేను అనుకోలేదు.. కానీ, ఇప్పుడు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటోంది.. రాజకీయ క్షేత్రంలో నిలబడి తీరుతామని స్పష్టం చేశారు. అంతేకాదు.. అవసరం అయితే, తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, నేనూ పాల్గొంటానంటూ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే.. తన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కాకరేపిన పవన్.. బుధవారం ఉదయం తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. ‘అదే నా రాస్తా’.. అంటూ పవన్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘‘ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా…’’

పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును బట్టి చూస్తుంటే.. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై గట్టిగానే దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా పవన్ దూకుడును చూసి తెలంగాణలోని జనసేన పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బలమైన పార్టీగా జనసేన ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.