Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ అధిష్టానం
Jubilee Hills By Election జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ అధిష్టానం అభ్యర్థి పేరు ఖరారు చేసింది. బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును
- Harishth Thanniru
- Published On : October 15, 2025 / 11:31 AM IST
Deepak Reddy
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అధిష్టానం అభ్యర్థి పేరు ఖరారు చేసింది. బుధవారం ఉదయం లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగారు. అయితే, తాజాగా.. బీజేపీ అధిష్టానం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 25,866 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ రెడ్డి ఉన్నారు. అయితే, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పోటీ పడ్డారు.. దీంతో బీజేపీ అధిష్టానం పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు, సర్వేల అనంతరం దీపక్ రెడ్డి పేరు బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈనెల 21వ తేదీ వరకు షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరిస్తారు.
22వ తేదీన నామినేషన్ల పరిశీలన.. 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.
ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరుగుతుంది.
నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.
నవంబర్ 16వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగియనుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాలు భావిస్తున్నాయి. ఈ ఉపపోరుకు సంబంధించి ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా.. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. తాజాగా.. బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
