Kalvakuntla Kavitha: నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ లో చేరేది లేదు.. సింగరేణి వేదికగా కవిత ఫైర్
భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన హెచ్ఎంఎస్ కార్మిక సంఘం సమావేశంలో ఆ సంఘ గౌరవ అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) పాల్గొన్నారు.
- V Santhosh Kumar
- Published on- July 9, 2026 / 05:18 PM IST
Kalvakuntla Kavitha challenged ktr and Harish Rao at the Singareni meeting
- సింగరేణిని ఆదుకోవాలని డిమాండ్
- కాంగ్రెస్ అవినీతిపై ధ్వజం
- బీఆర్ఎస్లో చేరేది లేదు
Kalvakuntla Kavitha: భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన హెచ్ఎంఎస్ (HMS) కార్మిక సంఘం సమావేశంలో ఆ సంఘ గౌరవ అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తనకు పుట్టింటి లాంటిదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలో వేలాది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిలో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైన్లు రెండూ ఉండాలని, అయితే పర్యావరణ కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 40 ఏళ్లుగా కార్మికుల హక్కుల కోసం హెచ్ఎంఎస్ పోరాడుతోందని గుర్తుచేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటు విమర్శలు:
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బీజేపీ వైఖరిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణికి టెండర్లు లేకుండా మైన్స్ కేటాయించే దమ్ము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాల మెడికల్ బోర్డును అవినీతిమయం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా కార్మికులకు సరైన పనిముట్లు ఇవ్వడం లేదని, ‘వన్ విజన్ వన్ ఆల్’ అనేది కేవలం నినాదంగానే మిగిలిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను, ప్రజలను అరకొర హామీలతో ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తే లేదు:
గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వల్లే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని కవిత ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విలేకరులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై చేస్తున్న చౌకబారు ప్రచారాలను ఖండించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, కార్మికుల హక్కుల కోసం తమ పార్టీ ద్వారా నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆమె తేల్చి చెప్పారు.
