KCR: తండ్రి కేసీఆర్ను కలిసిన మంత్రి కేటీఆర్?
ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక మంగళవారం కేసీఆర్ ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కలిసినట్లు సమాచారం.
- kunduru Vinod
- Published On : April 21, 2021 / 07:39 AM IST
Kcr
KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక మంగళవారం కేసీఆర్ ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కలిసినట్లు సమాచారం. కరోనా నిబంధనలను పాటిస్తూ కేటీఆర్ తండ్రిని పలకరించినట్లు తెలిసింది. వ్యవసాయ క్షేత్రం నుంచి కేటీఆర్ నేరుగా హైదరాబాద్ తరలి వెళ్లినట్లుగా సమాచారం.
ఇక సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. కేసీఆర్ గోత్ర, నామాలతో ప్రత్యేక హోమాది పూజలు నిర్వహించారు.
ప్రజల సుభిక్షార్థం ధన్వంతరి హోమం జరిపించారు. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి అశీసులతో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో కోలుకోవాలని పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు. ఈ పూజల్లో ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ను పరామర్శించిన నేతలు
సీఎం కేసీఆర్ ను ఫోన్ ద్వారా పలువురు నేతలు పరామర్శించారు. వీరిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోరాచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఇక సీఎం ఆరోగ్యపరిస్థితిపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆరా తీశారు.
సీఎం త్వరగా కోలుకుని తిరిగి ప్రజల సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అర్చకులను కోరారు.
