Warangal Rains : మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వరంగల్ లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. అనేక లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అలమటిస్తున్న నగర వాసులకు తాజాగా కురిసిన వర్షం కాస్తంత ఊరట నిచ్చింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి.
వరంగల్ అండర్ రైల్వే గేట్, పెరుకావాడ, సాకరశి కుంట, ఏకశిలా నగర్, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్ తోట, ఉర్సు గుట్ట, బిఆర్ నగర్, శివనగర్, సమ్మయ్య నగర్ పలు కాలనీలలో జలమయం అయ్యాయి. కొన్ని ఏరియాల్లో రోడ్లపై నీరు భారీగా నిలిచింది. డ్రెయినేజీలు మూసుకుపోవడంతో రోడ్లపైనే వరద నీరు భారీగా నిలిచిపోయింది. రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read : PM Modi: పీఎం మోదీ చేతుల మీదుగా తమిళనాడులో 11 మెడికల్ కాలేజీలు ప్రారంభం
చిన్నపాటి వర్షానికే వరంగల్ నగరంలోని అనేక కాలనీలు జలమయమవుతున్నా గ్రేటర్ వరంగల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీలకు మరమ్మతులు నిర్వహించడం, వెడల్పు చేయటం వంటి పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే కాలనీలు నదులను తలపిస్తున్నాయని సామాన్య జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.