×
Ad

Mass Copying: HCU పరీక్షలో రోబో తరహా సీన్.. అక్కడ చిట్టి, ఇక్కడ ఏఐ.. హైటెక్ కాపీయింగ్‌ మామూలుగా లేదుగా..

పోలీసులు నిందితుల నుంచి స్కానర్లు, బ్లూటూత్‌ స్వాధీనం చేసుకున్నారు.

Mass Copying: మీరు రోబో సినిమా చూశారా? అందులో హీరోయిన్ ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. టైమ్ అయిపోయింది, ఏమీ చదువుకోలేదు, ఫెయిల్ అయిపోతాను అని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో రోబో అక్కడికి వస్తుంది. హీరోయిన్ బాధ చూసి తట్టుకోలేకపోతుంది. నీ బదులు నేను ఎగ్జామ్ రాస్తాను అని చెబుతుంది. అదెలా సాధ్యం అని హీరోయిన్ అంటుంది. ఫోటో ఐడీ, ఎగ్జామ్ కార్డ్ అన్నీ ఉన్నాయి, నువ్వు రాయటం కుదరదని చెబుతుంది.

దానికి ఓ దారి ఉందని రోబో బదులిస్తుంది. రోబో ఎగ్జామ్ సెంటర్ బయట గార్డెన్ లో కూర్చుంటుంది. హీరోయిన్ బ్లూ టూత్ పెట్టుకుని ఉంటుంది. రోబో సమాధానాలు చెబుతుంటే.. హీరోయిన్ సమాధానాలు రాస్తుంది. దీనికి కారణం రోబో దగ్గర బిల్డ్ ఇన్ డేటా ట్రాన్స్ మీటర్ ఉండటం, హీరోయిన్ చెవిలో ట్రాన్స్ రిసీవర్ ఉండటం. రోబో చెబుతుంటే.. అది హీరోయిన్ కు వినిపిస్తూ ఉంటుంది. దీన్నే జిగ్ బీ ప్రోటోకాల్ అంటారు. ఇందులో బిల్డ్ ఇన్ ట్రాన్స్ మీటర్, ట్రాన్స్ రిసీవర్ సాయంతో కాపీయింగ్ జరుగుతుంది.

ఇప్పుడు రోబో సినిమా గురించి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. అచ్చం ఇలాంటి సీన్.. రియల్ లైఫ్ లోనూ కనిపించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోబో సినిమాలోని కాపీయింగ్ సీన్ వెలుగుచూసింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరీక్షల్లో కలకలం రేగింది. మాస్ కాపీయింగ్ వెలుగు చూసింది. అత్యాధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను కాపీయింగ్ కు వాడేశారు. ఏఐతో కాపీయింగ్‌కు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారిని అరెస్ట్ చేశారు. షర్ట్‌ బటన్‌లో మైక్రో స్కానర్లు అమర్చుకున్నారు యువకులు. బ్లూటూత్‌లో వింటూ పరీక్ష రాశారు. ఇది ఇన్విజిలిటేర్ గమనించాడు. దాంతో వారి బండారం బట్టబయలైంది. ఇన్విజిలేటర్ ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుల నుంచి స్కానర్లు, బ్లూటూత్‌ స్వాధీనం చేసుకున్నారు. ఏఐ ద్వారా కాపీయింగ్ కు పాల్పడిన అంశం కలకలం రేపింది.

Also Read: భారతీయులకు షాక్.. హెచ్‌-1బీ లాటరీ ఇక ఉండదు.. వర్క్‌ వీసాల జారీ ఇకపై ఇలా..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఇద్దరు యువకులు టెక్నాలజీని దుర్వినియోగం చేశారు. ఏఐ సాయంతో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. వారిద్దరిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకి చెందిన అనీల్, సతీష్.. అత్యంత ఖరీదైన, అధునాతన పరికరాలను ఉపయోగించి పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్ కు అడ్డంగా దొరికిపోయారు.

షర్ట్ బటన్స్ తో క్వశ్చన్ పేపర్ స్కాన్..

నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా చాలా ప్లాన్డ్ గా ఎగ్జామ్ సెంటర్ కి వచ్చారు. షర్ట్ బటన్లకు మైక్రో స్కానర్లు అమర్చుకున్నారు. ఈ స్కానర్ల ద్వారా ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేశారు. తరచూ బాత్‌రూమ్‌కు వెళ్తూ బయట ఉన్న తమ నెట్‌వర్క్ సాయంతో ఏఐ (AI) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి జవాబులు సేకరించారు. ఆ సమాధానాలను తమ చెవిలో అమర్చుకున్న అత్యంత చిన్న బ్లూటూత్ పరికరాల ద్వారా వింటూ పరీక్ష రాశారు. అయితే, పరీక్ష జరుగుతున్న సమయంలో అనిల్ చెవిలోని బ్లూటూత్ పరికరం నుండి హఠాత్తుగా వచ్చి బీప్ శబ్దంతో బండారం బట్టబయలైంది. ఇన్విజిలేటర్‌కు డౌట్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు అతడికి చెక్ చేశారు. దాంతో అతడి దగ్గరున్న గ్యాడ్జెట్లు బయటపడ్డాయి.

యూనివర్సిటీ అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నిందితుల నుండి మైక్రో స్కానర్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల కోసం ఇంతటి భారీ స్థాయిలో టెక్నాలజీ వాడిన వైనం సంచలనంగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ హైటెక్ కాపీయింగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు.