Encounter: తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. 28మంది మావోయిస్టులు మృతి.?
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రె గుట్టల్లో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
- Harishth Thanniru
- Published On : April 26, 2025 / 10:50 AM IST
Encounter
Encounter: తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలలో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ కీలక నేతలు హిడ్మా, దేవ టార్గెట్ గా ఐదు రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతుంది. మూడు రాష్ట్రాల నుండి ఇరవై వేల మంది బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అయితే, శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28మంది మావోయిస్టులు మరణించారని సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది.
కర్రెగుట్టలో సుమారు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. గుట్ట సమీపంలో గ్రామ ప్రజలు బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. రాత్రి పగలు అనే తేడాలేకుండా డ్రోన్ల సహాయంతో ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.
మూడు రాష్ట్రాల నుండి 20వేల మంది బలగాలు కర్రెగుట్టలో ఆపరేషన్ లో పాల్గొన్నాయి. వీరికి ఎనిమిది హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, భోజనాలు, నీళ్లు సరఫరా చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టు కదలికలను గుర్తించేందుకు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సమాచారాన్ని భద్రతా బలగాలు గోప్యంగా ఉంచుతున్నాయి. మరోవైపు మావోయిస్టులపై కాల్పులు నిలుపుదల చేయాలని నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి.
కర్రెగుట్టలుపై కేంద్ర బలగాల దాడులు నిలిపివేయాలని, బలగాలను వెనక్కి పిలవాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలంటూ పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి పాత బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే, శాంతిచర్చల లేఖలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని తెలుస్తోంది.
