Indiramma Housing: ఇచ్చిన మాట ప్రకారం పేదవారికి పూర్తి భరోసా కల్పిస్తూ హామీలు అమలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నామని అన్నారు.
అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయిస్తున్నామని పొంగులేటి చెప్పారు. మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. జీ ప్లస్ త్రీతో పాటు జీ ప్లస్ ఫోర్ విధానంలో ఇళ్లను నిర్మిస్తామని వివరించారు. 3.82 లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు.
“మా ప్రభుత్వం పేదవారికి మంచి చేసే విషయంలో, పూర్తి భద్రత భరోసా కల్పించే విషయంలో ఒక్క అడుగు కూడా ఎక్కడా వెనకకు వేయకుండా ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పేదవాడికి మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.
నాలుగు విడతల్లో ప్రతి సోమవారం.. కట్టుకున్న లెవెల్ను బట్టి 5 లక్షల రూపాయలు విడతలవారీగా ఇస్తూ, పేదవాడికి ఎక్కడా బర్డెన్ కాకుండా ఉండే విధంగా ఇల్లు కంప్లీషన్ చేసే దిశలో ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికలకు ముందు పేద రైతులు, భూములు ఉన్న ఆసాముల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన మరక్షణం ధరిణిని బంగాళ ఖాతంలో వేస్తామని చెప్పాం. మాట ప్రకారం ఆనాటి దొరలు నలుగురు నాలుగు గోడల మధ్య తయారు చేసిన ధరిణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా భూభారతిని తీసుకొస్తున్నాం” అని అన్నారు.