Minister Ponnam Prabhakar
Minister Ponnam Prabhakar : గణేశ్ నవరాత్రులు విజయవంతం అయ్యాయని, గణనాథుల నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని పొన్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 131 క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300కుపైగా క్రేన్లు అందుబాటులో ఉంచామని వివరించారు. శివారు ప్రాంతాల్లో చెరువులు, మిని పాండ్స్ లో వినాయకుల నిమజ్జనం చేసుకు అవకాశం ఉందని తెలిపారు.
Also Read : Chiranjeevi – Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ..
త్వరగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభం అవుతుందని తెలిపారు. 70ఏళ్ల అనుభవం ఉత్సవ కమిటీకి ఉంది.. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుందని అన్నారు. సాగర్ వైపు వచ్చే వినాయక నిమజ్జన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారికి సహాయం అందించేందుకు మా అలెర్ట్ టీంలు సిద్ధంటా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం తరపున నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనోత్సవాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.