Telangana
Telangana : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. అయితే, మరో ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది.
రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో (కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల) ఓటరు జాబితా సవరణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సంఘం అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. రేపటి నుంచి జనవరి 10వ తేదీ వరకు జాబితా తయారీకి ఎస్ఈసీ గడువు విధించింది. అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించబడుతుంది. ఈ తుది జాబితా ఆధారంగానే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది.
ఓటర్ల జాబితా షెడ్యూల్ ..
♦ ఈసీఐ పోలింగ్ స్టేషన్ల డేటా మున్సిపాలిటీల వారీగా క్రమబద్ధీకరణ – 30.12.2025
♦ వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజన – 31.12.2025
♦ మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన – 31.12.2025
♦ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ – 01.01.2026
♦ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం (జిల్లా స్థాయి) – 05.01.2026 నుండి 06.01.2026 వరకు
♦ తుది ఓటర్ల జాబితా విడుదల – 10.01.2026