Woman suicide attempt in Hyderabad : హైదరాబాద్ జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేసే సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ భిక్షపతి మహిళను కాపాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మంటల్లో అతని రెండు చేతులు కాలగా.. మోకాళ్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితురాలిని, ఇన్స్పెక్టర్ను ఆసుపత్రికి తరలించారు.
జవహర్ నగర్ పీఎస్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గందరగోళం నెలకొంది. గత కొంతకాలంగా ప్రభుత్వం స్థలంలో కొంత మంది అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈనేపథ్యంలో కాప్రా మున్సిపాలిటీ అధికారులు పోలీసుల సహాయసహకారాలతో నేరుగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసే పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలను నిరసిస్తూ ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఇది గమనించిన ఇన్స్ పెక్టర్ ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఇన్స్ పెక్టర్ కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇన్స్ పెక్టర్ ను పోలీస్ వెహికిల్ లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మహిళ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.