Nizamabad: కాలయముడిగా మారిన కన్నతండ్రి.. రెండు నెలల పసికందును.. కత్తితో పొడిచి రైల్వే ట్రాక్పై..
తనకు పుట్టలేదనే గుడ్డి నమ్మకంతో ఆ కసాయి తండ్రి కన్నకొడుకుపైనే పగ (Nizamabad)పెంచుకున్నాడు.
- V Santhosh Kumar
- Published on- June 19, 2026 / 05:09 PM IST
Nizamabad man kills two month old son over paternity suspicion
- అనుమానంతో కన్నకొడుకును చంపిన తండ్రి.
- పసికందును కత్తితో పొడిచి దారుణంగా..
- శవాన్ని రైల్వే ట్రాక్పై పారేసిన..
Nizamabad: కన్నప్రేమను మరిచి, కఠినంగా మారిన ఓ తండ్రి కిరాతకానికి రెండు నెలల పసికందు బలైపోయింది. నిజామాబాద్ (Nizamabad)నగరంలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అశోక్ నగర్కు చెందిన యువరాజ్, ప్రియాంకలకు సంవత్సరం క్రితం పెళ్లయింది. వీరికి రెండు నెలల క్రితమే ‘ప్రేమ్’ అనే బాబు పుట్టాడు. ఆ చిన్నారి నవ్వులు ఇంట సంతోషం నింపాల్సింది పోయి, తండ్రి మనసులో అనుమానపు బీజాలు నాటింది. ఆ పసికందు తనకు పుట్టలేదనే గుడ్డి నమ్మకంతో ఆ కసాయి తండ్రి కన్నకొడుకుపైనే పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆ పసిగుడ్డును ఇంట్లో నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పాలు తాగే పసివాడని కూడా చూడకుండా, కత్తితో పొడిచి అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై పాపానికి సాక్ష్యం లేకుండా ఉండేందుకు మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పక్కన పారేశాడు. తన కంటిపాప కనిపించకుండా పోవడంతో తల్లడిల్లిపోయిన తల్లి ప్రియాంక, వెంటనే నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి యువరాజ్ ప్రవర్తనపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ ఘోర నిజాన్ని ఒప్పుకున్నాడు. కన్నతండ్రే కాలయముడిగా మారి పసిప్రాణాన్ని బలితీసుకున్న ఈ అమానుష ఘటన విన్న ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
