Hyderabad Operation ROPE : హైదరాబాద్ నగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆపరేషన్ రోప్ ప్రారంభం అయ్యింది. ఆపరేషన్ రోప్ అమల్లో భాగంగా మలక్ పేట్ లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నో పార్కింగ్ జోన్, షాపుల ముందు రూల్స్ కు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానాలు వసూలు చేశారు. ఫుట్ పాత్ లపై వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా హెచ్చరించారు. ఇకపై ఇక్కడ విక్రయాలు చేపట్టొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని స్పష్టం చేశారు పోలీసులు.
కాగా, ఆపరేషన్ రోప్ అమలుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీ ఉండే ప్రదేశాల్లో ట్రాఫిక్ డ్రైవ్ చేపట్టకుండా మూసారంబాగ్ రోడ్ లో ఆపరేషన్ రోప్ చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రద్దీగా ఉండే హోటల్స్, కార్పొరేట్ సంస్థల దగ్గర ఉండే ట్రాఫిక్ ను వదిలేసి సాధారణ ట్రాఫిక్ ఉండే చోట పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. పార్కింగ్ నిబంధనలు పాటించకుండా మల్టీ కాంప్లెక్స్ లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా ఫైన్లు వేయడం సరికాదని వాహనదారులు చెబుతున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ రోప్ అమలు చకచకా సాగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అమలవుతున్న ఆపరేషన్ రోప్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ పరిశీలించారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనదారులకు కొత్త రూల్స్ గురించి అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.
వాహనదారులు పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు ప్రారంభించారు. వాహనదారులు నిబంధనలు మీరితే వెంటనే జరిమానా విధిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్టాప్లైన్ దాటితే రూ.100 జరిమానా, ఫ్రీ లెఫ్ట్కు ఆటంకం కలిగిస్తే రూ.1000 జరిమానా, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే రూ.600 జరిమానా విధించనున్నారు. దుకాణదారులు ఫుట్పాత్లను ఆక్రమిస్తే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు, ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు, ఉల్లంఘనుల భరతం పట్టేందుకు ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది.