Sandhya Theatre Incident : హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో మరో ముగ్గురు అరెస్ట్..
రేవతి తనయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- Naveen
- Published On : December 9, 2024 / 12:08 AM IST
Sandhya Theatre (Photo Credit : Google)
Sandhya Theatre Incident : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని జుడిషియల్ రిమాండ్ కు తరలించారు పోలీసులు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ యజమాని సందీప్ తో పాటు మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. సరైన భద్రతా చర్యలు చేపట్టలేదనే కారణంతో సెక్యూరిటీ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.
ఈ నెల 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం సంచలనం రేపింది. రేవతి తనయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా చర్యలు చేపట్టారు. ఇక తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తో పాటు అతడి టీమ్ పైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే.
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి(39) అనే మహిళ చనిపోయింది. ఆమెను కాపాడేందుకు పోలీసులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. ఇక, రేవతి కుమారుడు శ్రీతేజ్(9) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఓ నిండు ప్రాణం పోయింది.
Also Read : జానీ మాస్టర్కు మరో బిగ్ షాక్..
