Ponguleti Srinivas Reddy : కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే భట్టి పాదయాత్ర : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు.
- bheemraj
- Published On : June 22, 2023 / 02:22 PM IST
Ponguleti Srinivas Reddy
Srinivas Reddy Visit Bhatti Vikramarka : కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టినట్లు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, కష్టాలను తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి భట్టి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఎర్రటి ఎండను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపారు.
అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తున్న పొంగులేటి.. నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద బస చేసిన భట్టి విక్రమార్కను పరామర్శించారు. వడదెబ్బతో అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను పరామర్శించడానికి వచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేరాలంటే ఎవరితో సాధ్యమో అందరికీ తెలుసన్నారు. ఆ కలలు నెరవేర్చడానికి భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర నూటికి నూరు శాతం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మాయ మాటలతో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. 100 శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా కేసీఆర్ అమలు చేయలేదని పేర్కొన్నారు.
ఇచ్చిన వాగ్ధానాలు హామీలు అమలు చేయకుండా దగా చేసిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పారు. అయితే, చేరికల సమయంలో తమ మధ్య సీట్లు ఒప్పందం లేదని.. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఐక్యతతో పని చేస్తామని స్పష్టం చేశారు. వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో.. వద్దో తాను చెప్పేటంత వ్యక్తిని కాదని తెలిపారు.
