Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. త్వరలోనే పంపిణీ!
రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 'స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards)' సర్వం సిద్ధమయ్యాయి.
- V Santhosh Kumar
- Published on- July 17, 2026 / 11:15 AM IST
Revanth Reddy government to distribute smart ration cards in Telangana
- స్మార్ట్ రేషన్ కార్డులు రెడీ
- ఏటీఎం కార్డు సైజులో తయారీ
- త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ
Smart Ration Cards: తెలంగాణ ప్రజల నిత్యావసరాల పంపిణీ వ్యవస్థలో ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ‘స్మార్ట్ రేషన్ కార్డులు’ సర్వం సిద్ధమయ్యాయి. యాదాద్రి భువనగిరి, జనగామతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు ఈ కార్డులు ఇప్పటికే చేరుకున్నాయి. గత ఇరవై ఏళ్లుగా పాత పద్ధతిలోనే సాగుతున్న రేషన్ కార్డుల రూపురేఖలను మార్చేస్తూ, ప్రభుత్వం వీటిని అత్యంత ఆధునికంగా రూపొందించింది. రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వీటిని ప్యాక్ చేసి, త్వరలోనే పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫ్యామిలీ ఫొటోలతో కూడిన కొత్త రేషన్ కార్డులను(Smart Ration Cards) జారీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటయ్యాక గత ప్రభుత్వం రేషన్ కార్డుల మార్పుపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే, 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతమైంది. 2025 ఫిబ్రవరి నుండి కొత్త కార్డుల దరఖాస్తులు, మార్పులు చేర్పుల ప్రక్రియను చేపట్టడంతో ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1,06,28,081కి, లబ్ధిదారుల సంఖ్య 3,42,50,110కు పెరిగింది.
ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులను వినూత్నంగా ఏటీఎం కార్డు సైజులో ప్లాస్టిక్తో తయారు చేశారు. ఈ కార్డుపై ఎడమ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో, కుడి వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ముద్రించారు. ఈ రెండు ఫొటోల మధ్యలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో ఉంటుంది. వీటితో పాటు లబ్ధిదారుడి పేరు, ప్రస్తుత ఫుడ్ సెక్యూరిటీ కార్డు (FSC) నంబర్, భద్రత కోసం ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్ను కూడా పొందుపరిచారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ మరింత సులభతరం కానుంది.
