Rythu Bharosa Application: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ‘రైతు భరోసా’ దరఖాస్తులు.. ఇవి తప్పనిసరి
రైతు భరోసా(Rythu Bharosa Application) పెట్టుబడి సాయం పొందడానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అవకాశం కల్పించింది.
- V Santhosh Kumar
- Updated on- June 27, 2026 / 10:04 AM IST
Rythu Bharosa scheme Applications in Telangana begin today
- కొత్త రైతులకు భరోసా అవకాశం.
- నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.
- వచ్చే నెల 5 గడువు.
Rythu Bharosa: వానాకాలం సీజన్ నుంచి కొత్తగా రైతు భరోసా పెట్టుబడి సాయం పొందడానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అవకాశం కల్పించింది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఈ శనివారం నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని రైతు వేదికల్లో సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులకు (AEO) దరఖాస్తులు(Rythu Bharosa Application) సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 30న ప్రభుత్వం వానాకాలం సీజన్ భరోసా నిధులను విడుదల చేయనుండటంతో, ఈ లోపు కొత్త రైతులకు కూడా అవకాశం కల్పించేందుకు ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.
కరీంనగర్ మండలంలో అర్హుల వివరాలు:
కరీంనగర్ మండలంలో మొత్తం 13,442 మంది రైతులు ఉండగా, వారిలో 11,810 మంది రైతు భరోసాకు అర్హులుగా ఉన్నారు. గతంలో యాసంగి సీజన్ నిధులను ప్రభుత్వం ఐదెకరాల లోపు ఉన్న 11,239 మంది రైతులకు రెండు విడతల్లో రూ.7,12,36,856 ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఈనెల 15 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన మరో 164 మంది రైతులకు కూడా ఈ సాయం అందనుంది. ఇందులో చామనపల్లి క్లస్టర్లో 32 మంది, దుర్శేడ్లో 47, మొగ్ధుంపూర్లో 39, నగునూరులో 46 మంది చొప్పున కొత్త రైతులు ఉన్నారు.
కావలసిన పత్రాలు.. చివరి తేదీ:
కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు వచ్చే నెల 5వ తేదీ వరకు ఆయా రైతు వేదికల్లో ఏఈవోలకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హులైన రైతులు తమ దరఖాస్తు ఫారంతో పాటు గుర్తింపు కార్డు (Omitted), పట్టాదారు పాసు పుస్తకం, మరియు బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ ప్రతులను జతచేయాలని మండల వ్యవసాయాధికారి సత్యం సూచించారు. లబ్ధిదారులు ఈ గడువు లోపు తమ పత్రాలను సమర్పించి రైతు భరోసా సాయాన్ని పొందవచ్చు.
