Telangana Assembly Budget Session 2026 : హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
Telangana Assembly Budget Session 2026 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు.
- Harishth Thanniru
- Published On : March 16, 2026 / 01:45 PM IST
Governor Shiv Pratap Shuklas
Telangana Assembly Budget Session 2026 : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. శ్రమించే తత్వం గల తెలంగాణ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అన్నారు.
విజన్-2047 ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించామని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరిందని, క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నామని చెప్పారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
జీహెచ్ఎంసీని ఇటీవలే మూడు కార్పొరేషన్లుగా విభజించామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని నాలుగు కమిషనరేట్లుగా విభజించామని చెప్పారు. నగరంలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని, హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని చెప్పారు. 23వ బయో ఆసియా ద్వారా 1,700 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని చెప్పారు. మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తుందని అన్నారు.
మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు రూ.9,222 కోట్లు ఆదాయ అయ్యాయని, ఎస్హెచ్జీలకు రూ. లక్ష కోట్ల రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, 3.38 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని గవర్నర్ చెప్పారు. రైతు భరోసాతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద గతేడాది వానాకాలంలో రూ.8,744 కోట్లు ఇచ్చామని, పంట రుణమాఫీ కోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. టీజీపీఎస్సీ, ఇతర నియామక బోర్డులను సంస్కరించామని, రికార్డు సమయంలో 67,763 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
