తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టు అమలుకు రేవంత్ సర్కార్ రెడీ.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్.. ప్రయోజనాలు ఇవే..

తెలంగాణ రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్ట అమలుకు..

Farmer ID project

Telangana Govt Farmer ID: తెలంగాణ రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ల (ఏఈఓ)కు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం.. మే5వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలయ్యే ఈ పథకంతో వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టు కింద ప్రతీ రైతుకు 11 నెంబర్ల యూనిక్ ఐడీ కేటాయిస్తారు. వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేస్తుంది. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడీలో రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్ బుక్ వివరాలు, భూమి రకం (ఎర్ర నేల, నల్ల నేల, తరి, మెట్ట), సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడీ కార్డు ద్వారా ఒక్క క్లిక్ తో రైతుల వివరాలు తెలుసుకోవచ్చు.

 

ఫార్మార్ ఐడీ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది. ఈ ప్రాజెక్టు కింద వివరాలు వ్యవసాయశాఖ రూపొందిచిన ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తారు. యాప్ లో వివరాలు ఎంటర్ చేసిన తరువాత రైతు మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాప్ లో నమోదు చేయగానే 11 అంకెల ఫార్మర్ ఐడీ జనరేట్ అవుతుంది. ప్రకృతి విపత్తుల సమయంలో ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి. పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడీతో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి.

 

ఈ ఐడీ ద్వారా రైతుల సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్ తో తెలుసుకోవచ్చు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.