Telangana Govt : అంగన్వాడీ వర్కర్లకు గుడ్న్యూస్.. ఇక వారి ఇబ్బందులకు చెక్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
Anganwadi workers Mobile Phones : తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ వర్కర్లకు కొత్త స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫోన్లను ఇప్పటికే ఆర్డర్ పెట్టింది. వారంపదిరోజుల్లో అంగన్వాడీలకు కొత్త ఫోన్లను అధికారులు అందజేయనున్నారు.
- Harishth Thanniru
- Published On : March 22, 2026 / 09:05 AM IST
Anganwadi workers Mobile Phones
- అంగన్వాడీలకు కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్..
- రూ.44.42 కోట్లో టీజీటీఎస్ ద్వారా ఆర్డర్
- వారంపదిరోజుల్లో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్
Anganwadi workers Mobile Phones : తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారికోసం కొత్త ఫోన్లను కొనుగోలు చేసింది. వారం పదిరోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లను పంపిణీ చేయనున్నారు. అంగన్ వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, బ్లాక్ కో-ఆర్డినేటర్లకు ఫోన్లు పంపిణీ చేయనున్నారు.
అంగన్వాడీ టీచర్లు పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేసేందుకు గత ప్రభుత్వం 2019లో మొబైల్ ఫోన్లు ఇచ్చింది. ఫోషన్ ట్రాకర్ యాప్ ద్వారా దాదాపు 14రకాల వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం అంగన్వాడీల వద్దఉన్న ఫోన్లు పాతబడిపోయాయి. కాలం చెల్లిన ఫోన్లతోనే టీచర్లు కుస్తీపడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన 2జీ ఫోన్లు కావడం, సాప్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో నెట్వర్క్ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో పనులు నెమ్మదించాయి. పలు సందర్భాల్లో అంగన్వాడీలు వివరాలను అప్డేట్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధునాతన ఫీచర్లు ఉన్న శామ్సంగ్ గెలాక్సీ ఎం6 మోడల్ ఫోన్లను అందిస్తున్నారు. 4జీబీ ర్యామ్, 64జీబీ మెమోరీతో ఇవి పనిచేస్తాయి. వీటికి రెండేళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ టెక్నాలజీస్ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా ఒక్కో ఫోన్ రూ.11,650తో మొత్తం రూ.44.42 కోట్లతో 38,130 ఫోన్లను ఆర్డర్ చేశారు. అవి త్వరలోనే రానున్నాయి. వాటిని వారం పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, బ్లాక్ కో-ఆర్డినేటర్లకు పంపిణీ చేయనున్నారు.
కొత్త ఫోన్లు వస్తే ఆన్లైన్లో ప్రభుత్వానికి నివేదించాల్సిన సమాచారాన్ని వేగంగా అప్డేట్ చేయొచ్చునని అంగన్ వాడీలు పేర్కొంటున్నారు. పనులుసైతం సులభంగా, వేగంగా పూర్తవుతాయని అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
