Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ సోమవారం(ఆగస్టు 26,2021) నుంచే ప్రారంభం కానుంది. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తారు. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు.. పౌర సరఫరాల శాఖ సమాచారం ఇచ్చింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. కాగా, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం ఇవ్వనున్నారు.
నిజానికి గడిచిన నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉంది. వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు. డూప్లికేట్లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించి.. 3,09,083 మందిని అర్హులుగా తేల్చారు. అధికంగా హైదరాబాద్లో 56వేల 064 మందిని అర్హులుగా తేల్చగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు. రేషన్ కార్డుల విషయంలో పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్కార్డు అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.