Telangana Govt : రైతులకోసం రేవంత్ సర్కార్ మరో కొత్త కార్యక్రమం.. ఉపయోగాలివే.. అంతా గ్రామాల్లోనే..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ్టి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం కానుంది.
- Harishth Thanniru
- Published on- April 27, 2026 / 08:03 AM IST
Telangana government
- తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
- రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో కొత్త కార్యక్రమం
- గ్రామాల్లో పర్యటించనున్న శాస్త్రవేత్తల బృందాలు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ్టి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతోఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మే 23వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొనసాగనుంది.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు (Scientists) గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ యూనివర్శిటీ అధికారులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలతో కలిసి 200 బృందాలను ప్రభుత్వం నియమించిందని, ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహిస్తాయని తుమ్మల పేర్కొన్నారు.
సేంద్రీయ వ్యవసాయ పద్దతులు, సాగునీటి పొదుపు, ఎరువుల వినియోగం, యూరియా వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలపై ఈ బృందాలకు రైతులకు అవగాహన కల్పించనున్నాయి. అదేవిధంగా విత్తనాల ఎంపిక, వినియోగం తదితర అంశాలపైనా అవగాహన శాస్త్రవేత్తల బృందాలను గ్రామాల్లోకి వెళ్లి రైతులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించనున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. తక్కువ నీటితో పండే నూనె గింజలు, ఆయిల్ పామ్, పప్పుధాన్యాల సాగు వైపు రైతులు ఆలోచనలు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తూ రైతులు పంటల సాగు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
