Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది.
- Harishth Thanniru
- Published On : April 11, 2026 / 08:06 AM IST
CM Revanth Reddy
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోన్న ప్రభుత్వం
- ఇందిరమ్మ ఇండ్లకు మహిళా సంఘాల ఇటుకలు
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడంతోపాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వీటిని అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
సెర్ప్ అధికారులు నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 736 ఇటుక తయారీ యూనిట్లు మహిళా సంఘాల ద్వారా నడుస్తున్నట్లు గుర్తించారు. వీటిలో ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తాజా నిర్ణయం ద్వారా మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడంతోపాటు.. గృహ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని స్థానికంగానే సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని 736 ఇటుక తయారీ యూనిట్ల నుంచి ప్రస్తుతం రోజుకు 300 నుంచి 1000 ఇటుకలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ యూనిట్లు, పూర్తిస్థాయిలో నడిపిస్తే రోజుకు 2,500 వరకు ఇటుకలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహిళా సంఘాల ఉత్పత్తులకు గ్యారెంటీ మార్కెటింగ్ కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇటుకలను నేరుగా ఈ సంఘాల నుంచే కొనుగోలు చేయాలని గృహ నిర్మాణ శాఖతో సమన్వయం చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇటుకలను తక్కువ ధరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో మార్కెటింగ్ సమస్యలు ఉండవని, మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా సెర్ప్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది.
