ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు డబుల్ ధమాకా.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
Telangana Govt : రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ..
- Harishth Thanniru
- Published On : November 12, 2025 / 09:30 AM IST
Telangana Govt
Telangana Govt : రాష్ట్రంలోని ప్రతిపేదవాడికి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 9,456 ఇళ్లు మంజూరు చేయగా.. పలు నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే, ప్రభుత్వం ఈ ఇండ్ల నిర్మాణంలో అనేక నిబంధనలు విధించడంతో పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందిరమ్మ ఇండ్లకు నిరాదరణ, నిబంధనలు అడ్డును వరుసగా సడలింపులతో మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అడ్డుగా ఉన్న నిబంధనలను సరళతరం చేస్తోంది. అనుకున్న లక్ష్యం చేరి పేదలకు నీడ కల్పించేందుకు కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది.
ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లు తప్పనిసరిగా 400 -600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలనే నిబంధనలు ఉన్నాయి. పలుచోట్ల నిర్ణీత విస్తీర్ణంలో ఇళ్లు కట్టడం లేదని అధికారులు అనుమతి రద్దు చేస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగిస్తూ 400 చదరపు అడుగులు 44.4 చదరపు గజాలలో స్థలం ఉన్నా, జీ ప్లస్ వన్ విధానంలో ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు గైడ్ లైన్స్ సడలించింది.
ఇలా చేయాలి..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. నిర్ణీత విస్తీర్ణం లేని లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు జీప్లస్ విధానంలో చేపట్టాలుంటే ముందుగా అందుకు అనుమతి తీసుకోవాలి. గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఈఈ అనుమతి తీసుకున్న తరువాత నిర్మాణ పనులు చేపట్టాలి. ఈ విధానంలో ఇంటిని తప్పనిసరిగా ఆర్సీసీ ఫ్రేంలోనే నిర్మించాలి. ఇంటి నిర్మాణంలో తప్పనిసరిగా వంట గది, మరుగుదొడ్డి ఉండాలని నిబంధనలు విధించింది
నిబంధనలు ఇవే..
చిన్న ప్లాట్లలో ఇందిరమ్మ ఇళ్లను జీప్లస్ 1 పద్దతిలోనూ నిర్మాణం చేసుకునేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కనీస కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలి. కిచెన్, బాత్ రూం, టాయిలెట్ కచ్చితంగా ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్లో రూఫ్ నిర్మించాక రూ.లక్ష, మొదటి అంతస్తు రూఫ్ లెవెల్ వరకు కాలమ్స్ నిర్మించాక మరో రూ.లక్ష, గోడలు నిర్మించిన అనంతరం రూ.2లక్షలు, నిర్మాణం పూర్తయిన అనంతరం రూ.లక్ష నగదును విడుదల చేస్తారు.
