Bandi Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్
పోక్సో కేసులో బండి భగీరథ్(Bandi Bhageerath)కు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది.
- V Santhosh Kumar
- Published on- July 9, 2026 / 05:38 PM IST
Telangana High Court grants bail to Bandi Bhageerath in POCSO case.
- భగీరథ్కు బెయిల్ మంజూరు
- హైకోర్టు షరతులతో కూడిన ఉపశమనం
- దర్యాప్తునకు సహకరించాలని ఆదేశం
Bandi Bhageerath: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. హైదరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం భగీరథ్ను ఆదేశించింది. గత మే 16న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, దాదాపు 45 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈ బెయిల్ లభించింది.
కేసు నేపథ్యం, ఇరుపక్షాల వాదనలు:
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. మే 8న పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్(Bandi Bhageerath)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పరస్పర అంగీకారంతో జరిగిన వ్యవహారంగా దీనిని పేర్కొంటూ, గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల ఆధారంగా భగీరథ్ తరఫు న్యాయవాది టి.నిరంజన్రెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. భగీరథ్ ఒక విద్యార్థి అని, సుదీర్ఘకాలం జైలులో ఉండటం వల్ల కెరీర్ పరంగా నష్టపోయాడని కోరారు. అయితే, దర్యాప్తు దాదాపు పూర్తయిందని, ఈ దశలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యాయస్థానం తుది తీర్పు:
ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన ఇటీవల తీర్పును వాయిదా వేశారు. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం, భగీరథ్కు బెయిల్ ఇస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు విధించిన నిబంధనలకు, షరతులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గత కొన్ని వారాలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడటంతో పాటు, బండి సంజయ్ కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
