Telangana Police : అయ్యప్ప మాల ధరించిన వారికి బిగ్షాక్.. జుట్టు పెంచుకొని, యూనిఫాం, బూట్లు లేకుండా విధుల్లోకి రావొద్దు.. కఠిన ఆంక్షలు
Telangana Police : అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసు సిబ్బందికి ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
- Harishth Thanniru
- Published On : November 26, 2025 / 09:21 AM IST
Ayyappa initiation
Telangana Police : అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలు తీసుకునే పోలీసులు విధుల నుంచి సెలవు తీసుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బందికి సూచించింది. జుట్టు, గడ్డం పెంచుకొని, యూనిఫామ్కు బదులు సాధారణ దుస్తులు ధరించి, కాళ్లకు బూట్లు లేకుండా విధుల్లోకి రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
మతపరమైన దీక్షలపై పోలీసు శాఖ కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు చేపడితే తప్పనిసరిగా సెలవుపై వెళ్లాలన్న నిబంధన విధించింది. విధి నిర్వహణలో ఉండగానే అయ్యప్ప దీక్ష వంటి మతాచారాలు చేయకూడదని సూచించింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించి అయ్యప్ప మాల వేసుకున్నందుకు కంచన్బాగ్ ఎస్సై కృష్ణకాంత్కు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ మెమో జారీ చేశారు. పోలీసులు జుట్టు, గడ్డం పెంచుకోవద్దని కూడా ఆ మెమోలో సదరు డీసీపీ హుకుం జారీ చేశారు. అలాగే బూట్లు వేసుకోకుండా సివిల్ డ్రెస్సులో డ్యూటీ చేయవద్దని కూడా ఆదేశించారు.
Also Read: Nivetha Pethuraj : కుక్క కరిస్తే పెద్ద విషయం కాదట.. హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. భగ్గుమన్న నెటిజన్లు..
పోలీస్ శాఖలో ప్రస్తుతం ఎందరో ఉద్యోగులు అయ్యప్పమాల దీక్ష ధరిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు మాలలు ధరిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మాల ధరించిన వారు డ్యూటీలో ఉన్నప్పుడు ఇకపై యూనిఫామ్ ధరించాల్సి ఉంటుంది. ఒకవేళ దీక్షలో ఉంటే ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుంటే రెండు నెలల పాటు సెలవులు మంజూరు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీక్ష ధరించి విధులకు రావొద్దని, నల్ల దుస్తులు, నల్ల కండువాలు ధరించి యూనిఫామ్ లేకుండా విధులకు హాజరుకావొద్దని పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయ్యప్ప మాల ధరించిన పోలీసులపై పోలీసు శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు శాఖ జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాురు. ప్రతీ సంవత్సరం కూడా పోలీస్ శాఖ ఇలాంటి ఆదేశాలు ఇస్తోందన్న ఆయన.. హిందువులకే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రంజాన్ వేళ ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరని రాజాసింగ్ పోలీస్ ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
