MLC Election Results 2023: ఉమ్మడి రంగారెడ్డి – ఉమ్మడి మహబూబ్ నగర్ – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. గురువారం అర్థరాత్రి 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవటంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును కౌంటింగ్ సిబ్బంది చేపట్టారు. మూడో స్థానంలో ఉన్న టీఎన్యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారైంది.
ఈనెల 13న తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరిగింది. మొత్తం 29,720 ఓట్లలో 25,866 ఓట్లు పోలయ్యాయి. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా సారథ్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలుత ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. 50శాతంకు మించి ఎవరికీ మెజార్టీ దక్కలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను కౌంటింగ్ సిబ్బంది చేపట్టారు.
MLC election Results: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల వావా..
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7,505 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డికి 6,584, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికి 4,569, కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డికి 1,907 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి 1,236 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సుమారు 1,150 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి చెన్నకేశవరెడ్డిపై ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. అయితే, వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.