విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు.
- Harishth Thanniru
- Published On : April 14, 2025 / 02:55 PM IST
SC classification
SC classification: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు. అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఉద్యోగ, విద్యా అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు కాపీని సీఎం రేవంత్ కు అందజేసినట్లు తెలిపారు.
అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపాయని, సుప్రీంకోర్టు తీర్పు తరువాత రాష్ట్రాలకు అధికారాలు వచ్చాయని అన్నారు. వర్గీకరణ పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రెండు గంటల్లోనే వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపిందని ఉత్తమ్ గుర్తు చేశారు. వర్గీకరణ అమలు కోసం సీఎం కేబినెట్ సబ్ కమిటీ వేశారని, వర్గీకరణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనాలు చేశామని అన్నారు. కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయి.. వాటిని ఎంతో అధ్యయనం చేశామని తెలిపారు. అంతేకాక.. వర్గీకరణ కోసం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని అన్నారు. వర్గీకరణ తరువాతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అమలు చేస్తామని తెలిపామని, ఆ మేరకు ఇకనుంచి ఉద్యోగ, విద్యా అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. 30ఏళ్లుగా హక్కుకోసం పోరాటాలకు ఫలితం దక్కిందని అన్నారు. ఇవాళ్టి నుంచి రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రేపు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై సబ్ కమిటీ సమావేశం ఉందని చెప్పారు. ఈ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని వేల విజ్ఞప్తులు అందుకుని అధ్యయనం చేశామని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని, ఇవాళ్టి నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని రాజనర్సిహ తెలిపారు.
