ఈసారి ఎండలు ఎక్కువే..ప్రజలు జాగ్రత్త

Weather Department : ఈసారి ఎండలు ఎక్కువే అంటున్నారు వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత సంవత్సరం పోలిస్తే…తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సూర్యుడు ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో ఒకటి, రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా..వెంటనే పెరుగుతాయని..,మార్చి ఒకటి నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ప్రతీ ఎండకాలంలో..తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ వేసవిలోనూ ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. గతేడాదీ..వేసవికాలంలో లాక్‌డౌన్ కారణంగా పెద్దగా జనానికి వేసవి ఎఫెక్ట్ కనిపించలేదు. 2020 వేసవి కాలం అంతా లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే గడిచిపోయింది. వడదెబ్బ మరణాలు కూడా కనిపించలేదు. కానీ ఈ సారి ఆ పరిస్థితి ఉండదని, దీనికి తోడు ఈసారి వేసవికాలం సీజన్‌ కంటే నెల ముందుగానే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉండనున్నట్లు చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.

ట్రెండింగ్ వార్తలు