Telangana : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను డాబాపైకి తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి భార్య దారుణం.. ఆ తరువాతకూడా వదల్లేదు..
Telangana Crime News : భర్త ఉద్యోగం నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇటీవల భర్త తిరిగి రావడంతో ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసింది.
- Harish Thanniru
- Published on- July 6, 2026 / 09:24 AM IST
Wife Kills Husband
Telangana Crime News : భర్త ఉద్యోగం నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇటీవల గల్ప్ నుంచి భర్త ఇంటికి తిరిగి రావడంతో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని భావించిన భార్య అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.. ప్రియుడితోపాటు.. అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తి సహాయంతో భర్తను హత్యచేసింది. అయితే, తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని.. తన కోడులు ఇందుకు కారణమై ఉండొచ్చునని మృతుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అసలు గుట్టు వీడింది.
నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ (35) గల్ఫ్ లో ఉద్యోగం చేస్తూ జూన్ 27న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే, అతని భార్య దాయిని సంధ్యకు నిజామాబాద్ ఇంద్రపూర్ కాలనీకి చెందిన అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ప్రశాంత్ రాకతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతాడని భావించిన సంధ్య, ప్రియుడు అనిల్తో కలిసి భర్త ప్రశాంత్ హత్యకు ప్లాన్ చేసింది. దీంతో అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయాన్ని కోరారు. పథకం ప్రకారం.. జూన్ 29న వెంకటసాయి ప్రశాంతకు పరిమితికి మించి మద్యం తాగించి డాబాపైకి తీసుకెళ్లాడు.
సంధ్య ఫోన్లో సూచనలు ఇస్తుండగా ప్రశాంత్ను వెంకటసాయి డాబా పైనుంచి కిందకు నెట్టేశాడు. తీవ్ర గాయాలైనప్పటికీ ప్రశాంత్ చనిపోక పోవడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య, వెంకటసాయి కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రశాంత్ ను చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు. చికిత్స అనంతరం రాత్రి వేళ ఇంటికి తీసుకొచ్చాక మళ్లీ ప్రశాంత్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు.
ప్రియుడు అనిల్ సూచనతో సంధ్య తన భర్త ప్రశాంత్ చేతికి ఉన్న సెలైన్ కాన్యులా ద్వారా మత్తుమందులు, టాయిలెట్ క్లీనర్ కలిపిన ద్రవణాన్ని శరీరంలోకి ఎక్కించింది. ఆపై మంచంపై నుంచి కిందకుతోసి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసింది. అయితే, ప్రశాంత్ మృతివార్త తెలుసుకున్న అతని తల్లికి అనుమానం వచ్చింది. ప్రశాంత్ ను హత్యచేశారని భావించిన ఆమె.. తన కోడల్ని అనుమానించింది. ఊరు వచ్చిన విషయం గానీ, మరణించే వరకు జరిగిన విషయాలుగానీ కోడలు తనకు చెప్పకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు భార్య సంధ్యను విచారించగా అసలు విషయం గుట్టు రట్టు అయింది. దీంతో సంధ్యతోపాటు ఆమె ప్రియుడు అనిల్, మరో వ్యక్తి వెంకటసాయిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
