ఏపీలో ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం నిబంధనలను
ఏపీలో ఫ్యాక్టరీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం నిబంధనలను ఇప్పుడు అధికారికంగా జారీ చేసింది. ఈ నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) కింద నడిచేవాటితోపాటు జాయింట్ వెంచర్స్లో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంటుంది. సాంకేతిక, నైపుణ్యం ఉన్న వారితో పాటు నైపుణ్యం లేని వారిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. జనవరి నుంచి 3 త్రైమాసికాల్లో నియామకాలు చేయాలి. ఈ నియామకాలకు సంబంధించి జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ ఉంటుంది.
* రాష్ట్ర స్థాయిలో కార్మిక ఉపాధి కల్పన ట్రైనింగ్-ఫ్యాక్టరీస్ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, ఇండస్ట్రీస్ కమిషనర్ మెంబర్గా, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు.
* ఏపీలో పదేళ్లుగా నివసిస్తున్న ఎవరైనా ఈ చట్టం కింద ప్రయోజనం పొందొచ్చు.
* రేషన్ కార్డు, వాటర్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఓటర్ ఐడీ కార్డ్, గ్యాస్ కనెక్షన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా గుర్తింపు ఉండాలి.
* ఇవి లేకపోతే స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ధ్రువపత్రాన్ని నివాసానికి తగిన రుజువుగా పరిగణించాలి.
* స్థానికంగా నివసిస్తున్న వారికి 75శాతం ఉపాధి కల్పించాలి.
నైపుణ్యం లేని వారని కంపెనీలు భావిస్తే నోడల్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. నోడల్ ఏజెన్సీ.. ఆ అభ్యర్థులకు అవసరమైన ట్రైనింగ్ ఇప్పించి స్కిల్స్ మెరుగుదలకు కృషి చేస్తుంది. కంపెనీలు, సంస్థల ఓనర్లు ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావించి చర్యలు తీసుకుంటారు. నిబంధనలు పాటించకపోతే యజమాని నేరం చేసినట్లు భావించి మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రిపీట్ అయితే రూ.50 వేలు జరిమానా విధిస్తారు.