అమరావతి: అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..బ్రిటీషర్ల కాలం నుంచి 1956 వరకూ కాపులు బీసీలుగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వారిని ఓసీల్లో చేర్చి, రిజర్వేషన్లు తీసేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం ప్రవేశపెట్టిన బిల్లు పై చర్చను బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెనాయుడు ప్రారంభించిచారు. కాపులను బీసీ ,ఎఫ్ కేటగిరీగా కేటాయించి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం పట్ల ఆయన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5 శాతం.. ఈడబ్ల్యూఎస్ కోటాలో 5శాతం రిజర్వేషన్లను మంత్రి అచ్చెన్నాయుడు బిల్లులో ప్రతిపాదించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం కాపులను బీసీల్లో చేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ బీసీ కమిషన్ ద్వారా శాస్త్రీయంగా అధ్యయనం చేయించి కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలో ఈ బిల్లుపై ఫిబ్రవరి 7న అసెంబ్లీలో చర్చ జరుగనుంది. కాగా కాపు రిజర్వేషన్స్ అంశంపై క్షేత్ర స్థాయిలో కాపుల స్థితి గతుల్ని తెలుసుకోవడం కోసం మంజునాథ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.