ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి చేరింది. కాగా గతంలో నమోదైన పాజిటివ్ కేసుల్లోని వారిలో 10 మందికి నెగెటివ్ రాగా వారిని డిశ్చార్జ్ చేశారు. మరో ఆరుగురు మరణించారు. ప్రస్తుతం 365 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ పేషెంట్లు ఉన్న 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది.
ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ నివారణ మరియు ప్రజారోగ్యం చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్వారంటైన్, భౌతిక దూరం పాటించటం,మెరుగైన నిఘా, అనుమానాస్పద కేసులన్నింటీనీ పరిక్షించటం, కాంటాక్ట్స్ అందర్నీ ఐసోలేషన్ లో పెట్టటం మరియు కమ్యునిటీ వ్యాప్తి చెందకుండా కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.
కోవిడ్ 19 పాజిటివ్ కేసులున్న ప్రాంతం నుండి 3 కిలోమీటర్లు చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కంటైన్మెంట్ క్లస్టర్ గా తీసుకోబడుతుంది. కేసుల వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కిలో మీటర్ల ప్రాంతం కూడా బఫర్ జోన్ గా గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బఫర్ జోన్లను 7 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించారు. పాజిటివ్ కేసు పేషెంట్ ల పై ఏఎన్ఎం లు, ఆషా వర్కర్లు చే ఖచ్చితమైన నిఘా పెట్టారు.