కరోనా లక్షణాలు ఉంటే 104 కి కాల్ చేయండి

  • Publish Date - March 17, 2020 / 03:49 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని  రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. మార్చి17 మంగళవారం  ఆయన  విలేకరులతో  మాట్లాడూతూ.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో ఉండాలని చెప్పామని, వారి కోసం హోమ్‌ ఐసోలేటెడ్‌ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.ఇప్పటివరకు 7వేల మంది తెలుగువారు విదేశాల నుంచి ఏపీకి వచ్చారని  జవహర్ రెడ్డి వెల్లడించారు. ఇటలీ, స్పెయిన్‌, ఇరాక్‌, సౌత్‌ కొరియా, జపాన్‌ నుంచి వచ్చిన వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారి వివరాల కోసం గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు.

ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌, పీహెచ్‌సీ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. విదేశాలనుండి వచ్చిన వారిని 14 రోజులు క్వారెంటైన్‌ ఫెసిలీటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తెలిసిన తరువాతే ఇళ్లకు పంపుతున్నామని చెప్పారు. ఎరికైనా కరోనా లక్షణాలు కనబడితే 104కు కాల్‌ చేయమని సూచించారు.