టీడీపీ నాయకులపై దాడి చేసిన వ్యక్తికి బెయిల్

  • Publish Date - March 13, 2020 / 03:51 AM IST

తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల కారుపై దాడికి దిగిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తురకా కిషోర్‌ స్టేషన్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో తురకా కిషోర్ కర్రతో కారు అద్దాలను ధ్వంసం చేయగా.. కారులోనివారికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవగా.. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిషోర్‌ వైసీపీ పట్టణ యువజన సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. కిషోర్‌కు స్టేషన్‌ బెయిల్‌ మంజూరుపై గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ.. ప్రతిరోజూ స్టేషన్‌కు హాజరుకావాలనే షరతుపై అతనికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. తమపై వైసీపీ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడి చేశారని బోండా ఉమ మహేశ్వరరావు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. (టీడీపీ కంచుకోటలో ఆ సీటు దక్కేదెవరికీ..)

రోడ్డుపై అడ్డంగా వాహనాలు పెట్టి కర్రలు, రాడ్లతో దాడి చేశారని, దీనిపై హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలని బుద్ధా వెంకన్న పోలీసులను కోరారు. పోలీసులు ఉన్నా తమపై దాడికి దిగారంటూ అప్పుడు బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ దాడిలో ఓ లాయరుకు తీవ్రగాయాలు అవగా.. అతనిని రక్తం వచ్చేలా కొట్టారు.