నాడు వివేకా కూతురు.. నేడు షర్మిల.. జగన్ వెన్నుపోటు: చంద్రబాబు
- vamsi
- Published On : February 10, 2021 / 04:22 PM IST
chandrababu on sharmila’s party:తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ మీదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పందించారు. పార్టీ పెడుతున్నానని షర్మిల చెబుతుంటే విజయసాయిరెడ్డి మాత్రం లేదని చెబుతున్నారని అన్నారు.
ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఏమైందన్నారు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్.. షర్మిల పార్టీ పెట్టడంపై సమాధానం చెప్పాలని అన్నారు. జగనన్న వదిలిన బాణం అని చెప్పిన చెల్లికే వెన్నుపోటు పొడిచారని, ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇంట్లో వారిని మోసం చేస్తారు.. ప్రజలను మోసం చేస్తారు అంటూ దుయ్యబట్టారు.
రెండేళ్లు అయినా.. బాబాయి హత్యకేసును ఇంకా తేల్చలేదని, నాడు జగన్ సీబీఐ కావాలని అన్నారని, ప్రభుత్వంలోకి వచ్చాక ఇప్పుడు సీబీఐ అక్కర్లేదు అంటున్నారని ఆరోపించారు. బాబాయ్ని హత్య చేసినవారితోనే జగన్ జతకట్టారని విమర్శించారు. నాటి నుంచి వివేకా కూతురు.. ఇప్పుడు షర్మిల జగన్పై పోరాడుతున్నారని అన్నారు.
