ఏపీలో దిశ చట్టాన్ని అభినందిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు.
ఏపీలో దిశ చట్టాన్ని అభినందిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు, చిన్నారులకు ఈ చట్టం భరోసా కల్పిస్తుందన్నారు. సత్వర న్యాయం కోసం తొలి అడుగులు పడటం హర్షణీయమన్నారు.
ఏపీ కేబినెట్ మహిళలకు అండగా ఉండేలా చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్టం-2019కి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్స్ యాక్ట్ 2019కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడితే అతి త్వరగా నిందితులకు మరణశిక్ష పడేలా చట్టం తీసుకొచ్చింది. ఇటువంటి కేసుల్లో నిందితులను దోషులుగా నిర్థారించే ఆధారాలున్నప్పుడు మూడు వారాల్లోగా అంటే 21 వర్కింగ్ డేస్ ల్లో తీర్పు వచ్చేలా క్రిమినల్ లా చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ ఆమోదం పలికింది. ఇటువంటి కేసుల్లో వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి..14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి..మొత్తం 21 రోజుల్లో కోర్టుల్లో తీర్పు వచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రస్తుతం అత్యాచారాల కేసుల్లో నాలుగు నెలల్లోగా తీర్పు రావాలనే ఉంది. దీన్ని నాలుగు నెలల నుంచి 21 రోజులకు కుదిస్తూ చేసిన బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలోను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం జరిగింది. అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక ఘటనల్లో నేరాల విచారణకు ప్రతి జిల్లాల్లోను ప్రత్యే కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అంతేకాదు సోషల్ మీడియా వేధికగా బాధిత మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్టవేసేలా కేబినెట్ నిర్ణయించింది. మహిళలను కించపరిచేలా చేస్తున్న చర్యల్ని ఖండించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగ్ లు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపనుంది.
ఇటువంటి చర్యలు మొదటిసారి చేస్తే.. రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష పడేలా కఠిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పిల్లలపై లైంగిక వేధింపులు, నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్) సెక్షన్ కింద ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష..పోక్సో చట్టం కింద ఇప్పటి వరకూ 3 నుంచి ఐదేళ్లు జైలు శిక్ష ఉన్న ఈ శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవన్నీ అమల్లోకి రానున్నాయి.