అతను బీజేపీలో జగన్ ఏజెంట్: సీపీఐ నారాయణ

  • Publish Date - February 7, 2020 / 04:39 AM IST

భారతీయ జనతా పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోల్‌కతాలో జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో తీర్మానం చేసినట్లు వివరించిన ఆయన.. బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఓ నాటకం.. కేంద్రంలో మరో నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.

సీఎం జగన్‌కు జీవీఎల్ నరసింహరావు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోడీకి, అమిత్‌ షాకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగట్లేదని అన్నారు నారాయణ. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక నాటకం, రాష్ట్రంలో ఒక నాటకం ఆడుతున్నారని, బీజేపీ, వైసీపీ కలిసి కాపురం చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించవచ్చు కదా? అని ప్రశ్నించారు.

ఈ డొంక తిరుగుడు అనవసరమని, ఆ రెండు పార్టీలు లీగల్‌గా కాపురం చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు కదా? అని విమర్శించారు. ‘హైకోర్టు ఎక్కడైనా పెట్టుకోండి…సచివాలయం, అసెంబ్లీ మాత్రం ఒకేచోట ఉండాలని స్పష్టం చేశారు నారయణ.