ఏపీ ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఊరటనిచ్చింది. ఈకేవైసీ (EKYC-ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయకున్నా రేషన్ ఇస్తామని తెలిపింది. ఈకేవైసీ నమోదు
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చింది. ఈకేవైసీ (EKYC-ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయకున్నా రేషన్ ఇస్తామని తెలిపింది. ఈకేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ సరుకులు ఇవ్వరన్నది అవాస్తవం అని వెల్లడించింది. ఈకేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చని స్పష్టం చేసింది. 15ఏళ్ల వయసున్న వారికి అంగన్ వాడీ కేంద్రాలు, స్కూల్స్ లో ఆధార్ నమోదు, అప్డేట్ చేయించే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. తర్వాత రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు. 15సంవత్సరాలు దాటిన వారు ఆధార్ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ డీలరే ఈకేవైసీ చేస్తారని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఈ-కేవైసీ గందరగోళంపై ఏపీ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ క్లారిటీ ఇచ్చారు. ఆధార్ ఈ-కేవైసీ అప్ డేట్ కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆధార్ అప్ డేట్ కు గడువు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ-కేవైసీ కోసం బ్యాంకులు, ఆధార్, మీ-సేవ కేంద్రాలకు వెళ్లొద్దని సూచించారు. త్వరలోనే స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ-కేవైసీ అప్ డేట్ చేయకున్నా రేషన్ సరుకులు ఇస్తామని వెల్లడించారు.
ఈకేవైసీ గురించి రేషన్ కార్డుదారులు గందరగోళానికి గురవుతున్నారు. రోజూ తెల్లవారుజాము నుంచే రేషన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ సరుకులు కట్ చేస్తారనే ప్రచారం జరుగుతుండడమే ఇందుకు కారణం. టెక్నికల్ సమస్యలు ఎక్కువగా ఉండటంతో ఈకేవైసీ ప్రక్రియ వేగంగా సాగడం లేదు. ప్రజా సాధికార సర్వేలో మొత్తం కుటుంబ సభ్యులు నమోదు కాకపోతే ఈకేవైసీ చేయించుకోవాలని రేషన్ డీలర్లు చెబుతున్నారు. అసలు సాధికార సర్వేనే చేయించుకోకపోతే ముందు ఆ సర్వేలో నమోదు కావాలంటున్నారు. అయితే దానిపైనా స్పష్టత లేదు. కొత్తగా సర్వే చేయించుకున్నవారు మళ్లీ ఈకేవైసీ చేయించుకోవాలని డీలర్లు చెబుతుంటే, అవసరం లేదని జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితులతో ఇప్పటికే సంపూర్ణంగా సాధికార సర్వేలో నమోదైన వారు కూడా మళ్లీ ఈకేవైసీ కోసం క్యూలు కడుతున్నారు.
తొలుత ఈకేవైసీ నమోదు గడువు ఆగస్టు 20 వరకు విధించారు. ఆ తర్వాత గడువుని 15 ఏళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ 15 వరకు పెంచారు. ఈ పాస్ మెషిన్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం.. కొందరు కార్డుదారుల వేలి ముద్రలు సరిపోకపోవడంతో సమస్యలు వచ్చాయి. దీంతో ఈకేవైసీ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. ఈకేవైసీ నమోదులో భాగంగా ఆధార్ నమోదు కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. సరిపడ కేంద్రాలు లేకపోవడం… ఉన్నవి కాస్తా మూతపడటం… వాటిని పునరుద్ధరించేందుకు ఉడాయ్ స్పందించకపోవడం ఈ సమస్యకు కారణ మైంది. ఇప్పుడు ఆధార్ నమోదుకోసం జనం కేంద్రాల దగ్గర పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. పరిస్థితిని గమనించిన అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఈకేవైసీ నమోదుకు గడువు లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులకు స్కూల్స్ లోనే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read : గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ